
గంజాయి పట్టివేత?
భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణం మీదుగా 6 కేజీల గంజాయిని తరలిస్తుండగా టౌన్ పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. కాగా, గంజాయిని ఎక్కడి నుంచి ఎక్కడికి.. ఎంత మంది తరలిస్తున్నారు? దాని విలువ ఎంత? అనే వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
పేకాట స్థావరంపై దాడి
కరకగూడెం: మండలంలోని భట్టుపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఎస్ఐ పీవీఎన్ రావు కథనం ప్రకారం.. పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.3,000 నగదు, రెండు సెల్ఫోన్లు, ఒక ఆటోను సీజ్ చేసి కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.
కేసు నమోదు
చండ్రుగొండ: మండలంలోని అయన్నపాలెం గ్రామానికి చెందిన దండుగుల దినేశ్పై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివరామకృష్ణ బుధవారం రాత్రి తెలిపారు. అయన్నపాలేనికి చెందిన దినేశ్కు అదే గ్రామానికి చెందిన కృష్ణవేణితో ఆరేళ్ల కిందట వివాహమైంది. మద్యానికి బానిసైన దినేశ్ భార్యను అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో కృష్ణవేణి ఫిర్యాదు మేరకు దినేశ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
అతివేగంగా కారు నడిపిన డ్రైవర్పై ఫిర్యాదు
ఇల్లెందురూరల్: అతివేగంగా కారు నడిపి రోడ్డు ప్రమాదానికి కారకుడైన కారుడ్రైవర్పై చర్యలు తీసుకోవాలని టేకులపల్లి మండలం కోక్యాతండాకు చెందిన ఆటోడ్రైవర్ గుగులోత్ అరుణ్ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గార్ల మండలం సీతంపేట గ్రామానికి కుటుంబంతో సహా ఆటోలో వెళ్లి వస్తుండగా రేపల్లెవాడ స్టేజీ సమీపంలో ఎదురుగా వేగంగా వచ్చిన కారు.. తన ఆటోను ఢీకొట్టిందని, తనతోపాటు భార్య గాయపడిందని, ఆటో పూర్తిగా ధ్వంసమైందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కారు (టీఎస్ 04 ఈడీ 3828) డ్రైవర్పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
ఇసుక లారీల అడ్డగింత
మణుగూరుటౌన్: మున్సిపాలిటీలోని కమలాపురం గ్రామస్తులు ఇసుక లారీలను అడ్డుకున్న ఘటన బుధవారం మణుగూరులో చోటుచేసుకుంది. కమలాపురం, రాయిగూడెం, కోడిముత్తయ్యగుంపు ఇసుక డీసిల్టేషన్తో పాటు చినరాయిగూడెం ఇసుక సొసైటీల నుంచి పరిమితికి మించి లారీల రాకపోకలు సాగుతున్నాయి. అధిక లోడ్తో రోడ్లు దెబ్బతింటున్నాయి. మిషన్ భగీరథ పైపులు దెబ్బతిని ఐదు రోజులుగా నీటి సమస్య నెలకొంది. ఈ నేపథ్యంలో బుధవారం గ్రామస్తులు ఇసుక కోసం వచ్చిన వందలాది లారీలను నిలిపివేశారు. గ్రామస్తులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.