● శ్రీరామ నవమికి భద్రాచలంలో అన్ని ఏర్పాట్లు ● సరిపడా వసతులు, తలంబ్రాలు అందిస్తాం ● కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడి
భద్రాచలం : ఏప్రిల్లో ఎండలు అధికంగా ఉండనున్న నేపథ్యంలో ఈ ఏడాది శ్రీరామనవమికి వచ్చే భక్తులకు చల్లదనం కోసం ఈ ఏడాది ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. నవమి పనులను బుధవారం ఆయన పరిశీలించారు. మిథిలా స్టేడియంలో పునాది, స్వాగత ద్వారాలతో పాటు ఇతర పనులపై అధికారులతో చర్చించారు. అనంతరం మాట్లాడుతూ.. వేసవికాలంలో భక్తులకు ఉపశమనం కలిగించేందుకు తొలిసారి ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో మిస్ట్ ఫాగింగ్(పొగమంచు కురిసినట్టుగా) ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. భక్తులందరికీ సరిప డా ముత్యాల తలంబ్రాలు, ప్రసాదాలను దేవస్థానం ఆధ్వర్యంలో తయారుచేస్తున్నామని, కల్యాణాన్ని వీక్షించిన భక్తులు వాటిని స్వీకరించాలని సూచించారు. అందరికీ సరిపడా వసతులను కల్పించాలని, వీఐపీలతో పాటు సామాన్య భక్తులు కూడా ప్రశాంతంగా కల్యాణాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
మొబైల్యాప్పై అభినందన..
కలెక్టర్ పాటిల్ తొలుత రామాలయానికి చేరుకోగా ఈఓ రమాదేవి, అర్చకులు ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలంయలో ప్రత్యేక పూజల అనంతరం శ్రీ లక్ష్మీతాయారమ్మవారి ఉపాలయంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈఓ స్వామివారి జ్ఞాపిక, ప్రసాదం అందజేశారు. భక్తుల కోసం రూపొందించిన మొబైల్ యాప్ గురించి, అందులో పొందుపర్చిన సేవలు, సందర్శనీయ స్థలాలు, వసతుల గురించి వివరించారు. దీన్ని పరిశీలించిన కలెక్టర్ అధికారులను అభినందించారు.
దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ఎదగాలి
కొత్తగూడెంఅర్బన్: దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ఎదగాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. జిల్లా విద్యాశాఖ, అలింకో సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం కొత్తగూడెంలో దివ్యాంగ విద్యార్థులకు ఉచిత పరికరాలు, ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించే సదుపాయాలను దివ్యాంగులు వినియోగించుకునేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అన్నారు. దివ్యాంగులకు దృఢ సంకల్పం ఎక్కువగా ఉంటుందని, తనతో కలిసి చదువుకున్న మానసి జోషి ప్రమాదంలో కాళ్లు కోల్పోయినా దృఢ నిశ్చయంతో ఆడి పారా ఒలింపిక్లో గోల్డ్ మెడల్ సాధించిందని గుర్తు చేసుకున్నారు. దివ్యాంగ విద్యార్థుల ఎదుగుదలకు తోడ్పాటునందిస్తున్న స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లను అభినందించారు.