గుంటూరు వెస్ట్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి ఉపాధ్యాయులకు సూచించారు. గతంలో తయారు చేసిన ఓటరు జాబితాను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. రాజకీయపార్టీల ప్రతినిధులతో స్థానిక కలెక్టరేట్లోని వీసీ కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుని పదవీ కాలం 2027 మార్చి 29వ తేదీన ముగుస్తుందన్నారు. ఈనెల 28న ఉపాధ్యాయ ఓటరు నమోదు కార్యక్రమానికి బహిరంగ నోటీస్ విడుదల చేస్తామన్నారు. నవంబరు 6వ తేదీ వరకు ఓటరు నమోదుకు ఫారం–19 స్వీకరణ జరుగుతుందని చెప్పారు. నవంబరు 25న ముసాయిదా ఓటరు జాబితా విడుదల, డిసెంబర్ 10వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ, డిసెంబర్ 25వ తేదీ నాటికి అభ్యంతరాల పరిష్కారం జరుగుతుందని వివరించారు. డిసెంబర్ 30న తుది ఓటరు జాబితా విడుదల జరుగుతుందని చెప్పారు.
సర్లో పెండింగ్ చాలా తక్కువ
డీఆర్వో మాట్లాడుతూ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం (సర్) కింద 1,68,220 నోటీసులు జారీ చేయగా, 1,094 మాత్రమే విచారణ పెండింగ్లో ఉందన్నారు. ఫారం–6 12,044, ఫారం–7 2,047, ఫారం–8 9,085 దరఖాస్తులు అందాయన్నారు. బుక్ ఏ కాల్ కింద రాష్ట్రంలో అత్యధికంగా వచ్చిన కాల్స్లో గుంటూరు జిల్లా రెండవ స్థానంలో నిలిచిందన్నారు. సమావేశంలో ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, తెనాలి ఆర్డీఓ కె.శ్రీరమణి, ఈఆర్ఓలు ఐ.కిషోర్, పద్మావతి, గంగరాజు, ముఖ్య టౌన్ ప్లానింగ్ అధికారి రాంబాబు, వైఎస్సార్ సీపీ ప్రతినిధి వై.పిచ్చిరెడ్డి, బహుజన సమాజ్ పార్టీ ప్రతినిధి వాసు తదితరులు పాల్గొన్నారు.
డీఆర్వో షేక్ ఖాజావలి


