గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వైద్య సిబ్బంది ఆదివారం సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట మోకాళ్లపై నిలబడి తమ నిరసన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ఉద్యోగాలు రెగ్యులర్ అయ్యేవరకు నూరుశాతం గ్రాస్ శాలరీ ఇవ్వాలని, బదిలీ అవకాశం కల్పించాలని కాంట్రాక్ట్ వైద్య సిబ్బంది డిమాండ్ చేశారు. మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపిన వారిలో లక్ష్మీకుమారి, మేరీ కుమారి సోఫియా, ఫాతిమా, బాలాజీ తదితరులు ఉన్నారు.
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి కాలువకు ఆదివారం నీటిని నిలిపివేశారు. తాగు నీటి అవసరాల నిమిత్తం గత నెల 26వ తేదీన కుడికాలువకు నీటిని విడుదల చేశారు. సుమారు ఆరు వేల క్యూసెక్కుల చొప్పున సుమారు 10టీఎంసీల నీటిని విడుదల చేయటంతో కుడికాలువ పరిధిలోని ప్రధాన తాగునీటి చెరువులు నిండాయి. దీంతో కుడికాలువకు ఇరిగేషన్ అధికారులు నీటిని నిలుపుదల చేశారు.
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం భక్త జనంతో పోటెత్తింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణంలో క్యూలు భక్తులతో బారులుతీరాయి. ఆలయ ప్రాంగణం భక్తజనంతో నిండిపోయింది. నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళ్లశాల వద్ద భక్తులతో రద్దీ ఏర్పడింది. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.


