చేబ్రోలు: చేబ్రోలు సమీపంలోని కొమ్మమూరు ఛానల్ బ్రిడ్జివద్ద వాహనదారుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. చేబ్రోలు – మంచాల గ్రామాల మధ్య ఉన్న పురాతన వారధి వద్ద ఆదివారం లారీ నిలిచిపోవటంతో పొన్నూరు, గుంటూరు మార్గాల వైపు కి.మీల పొడవునా ట్రాఫిక్ నిలిచిపోయింది. కొద్దిరోజుల క్రితం బ్రిడ్జికి ఒకవైపు కొంతభాగం కూలిపోయింది. అప్పటినుంచి వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా రెండు రోజుల క్రితం పొన్నూరు వైపు వెళ్లే లారీ బ్రిడ్జిపై భాగంలో ఎదురుగా మరో వాహనం రావటంతో నిలిచిపోయింది. దీనిని సర్దుబాటు చేయటానికి పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. బ్రిడ్జి దాటడానికి ఆరుగంటలు సమయం పట్టినట్లు వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు వైపుల సుమారు నాలుగు కి.మీ పొడవునా ట్రాఫిక్ నిలిచిపోయింది.
నిలిచిన వాహనాలు
ఆదివారం కొమ్మమూరు బ్రిడ్జి వద్ద వినాయక చవితి పండుగ నేపథ్యంలో రాకపోకలు పెరగడంతో ట్రాఫిక్ కష్టాలు రెట్టింపు అయ్యాయి. వంతెన బలహీనపడటంతో పోలీసులు రాకపోకలను క్రమబద్ధీకరిస్తూ ప్రత్యామ్నాయంగా ఒకే వరుసలో వాహనాలను అనుమతించారు. పొన్నూరు వైపు కొద్దిసేపు, గుంటూరు వైపు కొద్ది సేపు వాహనాలను పంపారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఇరువైపులా వాహనాలు భారీ స్థాయిలో నిలిచిపోయి సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆర్టీసీ బస్సులు, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు అంగుళం కూడా ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది.
లారీ నిలిచిపోవడంతో రెండువైపులా 4 కి.మీ మేర స్తంభించిన ట్రాఫిక్


