బీమా, ఇన్పుట్ సబ్సిడీ ఊసేలేదు జగనన్న పెట్టిన పథకాలకు పేర్లు మార్చారేగానీ పనులు జరగటం లేదు ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు మూడు రోజులపాటు పాదయాత్ర మాజీ డెప్యూటీ స్పీకర్ కోన
బాపట్ల: రైతుల సంక్షేమం కోసం వైఎస్సార్ సీపీ పని చేస్తే... వారి సంక్షోభానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వ విధానాలు దారితీసినట్లు మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఒక పక్క క్రాప్ హాలీడే అంటూ, మరోపక్కన విత్తనాలు ఇస్తాం.. ఎరువులు ఇస్తామని చెప్పి రైతులను చంద్రబాబు మరోవైపు మోసం చేస్తున్నారని కోన తెలిపారు. ఈ నేపథ్యంలో గురు, శుక్ర, శనివారాల్లో బాపట్ల నియోజకవర్గంలో రైతుల సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. రైతులకు అండగా వెఎస్సార్ సీపీ అనునిత్యం ఉంటుందని తెలిపారు. రైతుల దగ్గర పంట ఉంటే రూ.1,200, రూ.1,400లకు ధాన్యం ధరలు పలికాయని, ఇప్పుడు వ్యాపారుల వద్ద ధాన్యం రూ.2,400కు అమ్ముతున్నారని కోన సూచించారు. రైతులు నష్టపోవాలి, దళారులు, వ్యాపారస్తులు బాగుపడాలనే తలంపుతో ప్రభుత్వం పని చేస్తోందని ఆయన పేర్కొన్నారు. రైతులకు బీమా సొమ్మును జగనన్న హయాంలో ప్రభుత్వం చెల్లిస్తే.. ఇప్పుడు రైతులే బీమా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు. జగనన్న కాలనీలు ఇప్పుడు ఎన్టీఆర్ కాలనీలుగా మారిపోయాయని చెప్పారు. పింఛన్లకు కూడా లేని పోని నిబంధనలు పెట్టి వృద్ధులను కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని ఆయన దుయ్యబట్టారు.
రైతులను ఆదుకోవాలి..
సకాలంలో నీళ్లు లేకపోయినా పంటలు వేసుకుని రైతులు నష్టపోయారని, సంబంధిత ప్రాంతాలను కరువు మండలాలుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేపడతామని కోన చెప్పారు. ఈ ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ గురువారం భావన్నారాయణ స్వామి దేవాలయం వద్ద ఉదయం 8 గంటలకు ప్రత్యేక పూజలు, పాత బస్టాండ్లోని మసీదు వద్ద, సీబీజెడ్ చర్చి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేపడతామన్నారు. తర్వాత పాదయాత్ర ప్రారంభం అవుతుందని వివరించారు. తొలిరోజు బాపట్ల మండలంలో మొదలయ్యే ఈ యాత్ర శుక్రవారం కర్లపాలెం, శనివారం పిట్టలవానిపాలెంలోని అల్లూరు వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ పాదయాత్రలో అందరూ పాల్గొని రైతులకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, ఉయ్యూరు లీలా శ్రీనివాసరెడ్డి, యల్లావుల ఏడుకొండలు, కాగిత సుధీర్బాబు, పార్టీ నాయకులు వడ్డిముక్కల డేవిడ్, కొక్కిలిగడ్డ చెంచయ్య, చల్లా రామయ్య, పిన్నిబోయిన ప్రసాద్, ఇనగలూరి మాల్యాద్రి తదితరులున్నారు.


