జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్
బాపట్ల: జిల్లాలో 22ఏ నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించే ప్రక్రియలో అధికారులు నిబంధనల మేరకు పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. బుధవారం 22ఏ కేసుల పరిష్కారంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో నిర్వహించారు. అర్హత ఉన్న పట్టా భూములన్నింటినీ నిషేధిత జాబితా నుంచి చట్టబద్ధంగా తొలగించాలని కలెక్టర్ చెప్పారు. ఇలా తొలగించడానికి చీరాల డివిజన్లోని 4 దరఖాస్తులపై సుదీర్ఘంగా చర్చించారు. తదుపరి వెబ్ ల్యాండ్, భూమి రికార్డులు, తదితరమైన రెవెన్యూ దస్త్రాలను పరిశీలించారు. విచారణ జరిపిన వాటిని తొలగించడానికి చర్యలు తీసుకున్నారు. దస్త్రాలు సరిగా లేనివి, సమగ్ర సమాచారం వివరాలు లేని దరఖాస్తులను తిరస్కరించారు. చిన్నగంజాం మండలంలోని పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయి అవగాహనతో పనిచేయాలని సూచనలు చేశారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ, ఇన్చార్జ్ డీఆర్ఓ లవన్న, జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి శ్రీనివాస్, జిల్లా భూమి రికార్డుల శాఖ సహాయ సంచాలకులు శేషగిరిరావు, చీరాల ఆర్డీవో, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.


