మంగళగిరి టౌన్: అత్యాధునిక కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతికతతో వైద్యరంగంలో సరికొత్త మార్పులకు మంగళగిరి వేదికగా నిలుస్తోంది. పేద, మధ్యతరగతి ప్రజలకు వేగవంతమైన, అందుబాటులో ఉండే వైద్య సేవలను అందించే లక్ష్యంతో మంగళగిరి పట్టణ పరిధిలోని గణపతి నగర్లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్సీ)లో ఎరోస్ వెల్నెస్ ఆధ్వర్యంలో వినూత్న ఏఐ ఆధారిత ఆరోగ్య పరీక్షల విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ నేపధ్యంలో బుధవారం ఏఐ ఆధారిత ముఖ స్కానింగ్ విధానంపై ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నోడల్ అధికారి శ్యామల మాట్లాడుతూ సాధారణంగా ఆరోగ్య పరీక్షలకు రక్త నమూనాలు సేకరించి ప్రయోగశాల నివేదకల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి ఉంటుందన్నారు. అయితే ఈ కొత్త విధానంలో రక్తనమూనా సేకరించడకుండానే కేవలం 60 సెకండ్లలో 60 రకాల ఆరోగ్య సూచికలను అంచనా వేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సాంకేతికతలో భాగంగా వ్యక్తి ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా రక్తప్రసరణ, చర్మకణాల కదలిక తదితర అంశాల ఆధారంగా సుమారు 28 రకాల శారీరక కొలమానాలను గుర్తించవచ్చని పేర్కొన్నారు. అదనంగా ఇంటర్నెర్ ఆధారిత జీవ సంవేదకాలు, ఆధునిక స్క్రీనింగ్ పరికరాలతో మరో 32 కీలక ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తారని వివరించారు. ఈ వినూత్న ప్రాజెక్ట్ను విజయవంతంగా అమలు చేసేందుకు యూపీహెచ్సీకి చెందిన సాంకేతిక నిపుణులు, వైద్య సిబ్బందికి రెండు రోజులు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. శిక్షణ పూర్తి అయిన అనంతరం పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎరోస్ వెల్నెస్ సీఈవో శిల్పాదేశాయ్, యూపీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ అనూష, వైద్యసిబ్బంది, ప్రయోగశాల సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 27.7565 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది.


