డీఎస్పీ పి.జగదీష్
బాపట్ల టౌన్: ఇప్పటివరకు శక్తి బృందాల సేవలు పట్టణ ప్రాంతాలకే పరిమితమయ్యాయని, ఇకపై వీరి సేవలను గ్రామీణ స్థాయికి కూడా విస్తరించి, పోలీస్ శాఖ అందిస్తున్న సేవలపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలని సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ సూచించారు. జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్ ఆధ్వర్యంలో జిల్లాలోని శక్తి బృందాలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మహిళలు, చిన్నారులు, గ్రామీణ ప్రాంతాల్లోని వృద్ధులకు శక్తి బృందాల ద్వారా అందించాల్సిన సేవల గురించి తెలిపారు. డీఎస్పీ పి.జగదీష్ నాయక్ మాట్లాడుతూ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న నాలుగు శక్తి బృందాల విధుల గురించి దిశా నిర్దేశం చేశారు. పాఠశాల విద్యార్థులకు ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ గురించి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్.సుబ్బారావు, ఎస్ఐ చెన్నకేశవులు, ఉమెన్ ఎస్ఐ చంద్రావతి, శక్తి టీమ్స్ సిబ్బంది పాల్గొన్నారు.


