జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్
యడ్లపల్లి(చుండూరు): ప్లాస్టిక్ వాడకాన్ని ప్రతి ఒక్కరూ తగ్గించేందుకు ప్రయత్నం చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వి.వినోద్కుమార్ సూచించారు. చుండూరు మండలం యడ్లపల్లి గ్రామంలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహించారు. గ్రామంలోని వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో మొక్కలు నాటారు. డ్వాక్రా గ్రూపుల మహిళల వ్యాపారాలను పరిశీలించారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రపై విద్యార్థుల, వివిధ శాఖల అధికారులు, గ్రామ ప్రజలు చేత ప్రతిజ్ఞ చేయించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రం చేయాలని సూచించారు. యడ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లాలో మోడల్ స్కూలుగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. జిల్లా విద్యా శాఖ అధికారులు యడ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదర్శంగా తీసుకోవాలని అన్నారు. బాపట్ల జిల్లాలో ప్రతి మండలంలోని ఒక గ్రామంలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ జాలాది రూబేను, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకరరావు, రేపల్లె ఆర్డీఓ శ్రీదేవి, సీపీఓ షాలెంరాజు, జిల్లా ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, డిప్యూటీ విద్యాశాఖాధికారి శివబాబు, డివిజన్ పంచాయతీ అధికారి పద్మావతి, మండల ప్రత్యేకాధికారి ఖలీల్, ఎంపీడీవో రాంబాబు, తహసీల్దార్ నాగరాజు, గ్రామ ప్రత్యేకాధికారి డి సుధారాణి తదితరులు పాల్గొన్నారు.


