పిన్నెల్లికి జన నీరాజనం | - | Sakshi
Sakshi News home page

పిన్నెల్లికి జన నీరాజనం

Mar 20 2026 8:05 AM | Updated on Mar 20 2026 8:05 AM

పిన్నెల్లికి జన నీరాజనం

భారీ గజమాలలు, బాణసంచాతో ఘన స్వాగతం పలికిన నాయకులు రహదారుల వెంబడి బారులు తీరిన అభిమానులు, కార్యకర్తలు

నకరికల్లు: అక్రమ కేసులో 98 రోజులపాటు అక్రమ నిర్భంధం అనుభవించి బెయిల్‌పై వస్తున్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మండలంలో ఘన స్వాగతం పలికారు. సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి గజ్జల సుధీర్‌భార్గవరెడ్డి ఆధ్వర్యంలో అభిమానులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో అడ్డరోడ్డుకు చేరుకున్నారు. సుమారు మూడున్నర గంటలపాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాకకోసం ఎదురుచూశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అడ్డరోడ్డు చేరుకోగానే హర్షధ్వానాలతో అభిమానులు హోరెత్తించారు. పిన్నెల్లిని, సత్తెనపల్లి ఇన్‌చార్జి గజ్జల సుధీర్‌భార్గవరెడ్డిని భారీ గజమాలతో సన్మానించారు. జయజయ నినాదాలతో హోరెత్తించారు. అడ్డరోడ్డు వద్ద గల శ్రీ అభయాంజనేయ స్వామిని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెల్దుర్తి మండలంలోని గుండ్లపాడులో టీడీపీ రెండు వర్గాల పోరులో వాళ్లకు వాళ్లు హత్యలకు పాల్పడితే కావాలని తమను అనవసరంగా ఇరికించారని వాపోయారు. 98 రోజులపాటు అక్రమంగా జైలులో పెట్టారన్నారు. ఎస్పీ సైతం ఆధిపత్యపోరులో ఈ హత్యలు జరిగాయని చెప్పినా తమను అన్యాయంగా కేసులో ఇరికించారన్నారు. తమకంటూ ఒకరోజు వస్తుందని... తప్పుడు కేసులు పెట్టడానికి కారణమైన వారిని కచ్చితంగా చట్టం ముందు నిలబెడతామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయాలని చూడడమే కాక తప్పుడు కేసులతో నోరు నొక్కాలని చూస్తోందని మండిపడ్డారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటామని... అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలో రెట్టింపు బలంతో దుర్మార్గంపై పోరాడతామన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ గజ్జల బ్రహ్మారెడ్డి, డాక్టర్‌ మేడికొండ పరమేశ్వరరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు పడాల శివారెడ్డి, మండల కన్వీనర్‌ భవనం రాఘవరెడ్డి, వైస్‌ ఎంపీపీ మేడం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, దూదేకుల బాషా పాల్గొన్నారు.

దాచేపల్లిలో..

దాచేపల్లి : మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి దాచేపల్లిలో ఘన స్వాగతం లభించింది. నగర పంచాయతీ చైర్మన్‌ కొప్పుల సాంబయ్య కుటుంబ సభ్యులు గజమాలతో సన్మానించారు. చైర్మన్‌ సాంబయ్య నివాసంలో అల్పాహారాన్ని పీఆర్కే స్వీకరించారు. అనంతరం నారాయణపురం బంగ్లా సెంటర్‌లో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయంలో పీఆర్కే ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. నగర పంచాయతీ వైస్‌ చైర్మన్‌ షేక్‌ ఖాదర్‌ బాషా రంజాన్‌ పండుగ సందర్భంగా పీఆర్కేకు టోపీ, చౌకన్‌, కంకణం బహూకరించారు. నడికుడి వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ వద్ద నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి, పార్టీ మండల, పట్టణ కన్వీనర్లు కోటా కృష్ణ, షేక్‌ సుభాని, నగర పంచాయతీ మాజీ చైర్మన్‌ మునగా పున్నారావు, జెడ్పీటీసీ మూలగొండ్ల ప్రకాష్‌ రెడ్డి, ఎంపీపీ కందులు జాను, వైస్‌ చైర్మన్‌లు షేక్‌ ఖాదర్‌ బాషా, కొమరభత్తిన విజయకుమార్‌, అధికార ప్రతినిధి షేక్‌ జాకీర్‌ హుస్సేన్‌, మాజీ సర్పంచ్‌లు మందపాటి రమేష్‌ రెడ్డి, బుర్రా విజయ్‌ కుమార్‌ రెడ్డి, క్రిస్టియన్‌ మైనార్టీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు పరిమి బాబు తదితరులు ఉన్నారు.

ప్రత్యేక పూజలు

మాచర్ల: మాచర్ల పట్టణానికి చేరుకున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మద్దతుగా వేలాది మంది తరలి వచ్చి ఘన స్వాగతం పలికారు. రాయవరం జంక్షన్‌లో ఆంజనేయస్వామి దేవాలయంలో పీఆర్కే ప్రత్యేక పూజలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement