బాపట్ల: ఉగాది పండుగ ప్రజలందరి జీవితాల్లో ఆనందాలను నింపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆకాంక్షించారు. ఉగాది వేడుకలు గురువారం స్థానిక కలెక్టరేట్లో ఘనంగా జరిగాయి. తొలుత జిల్లా కలెక్టర్కు మేళతాళాలతో స్వాగతం పలికారు. పవన్ కుమార్ అవధాని పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉగాది పచ్చడిని అతిథులకు అందజేశారు. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పంచాంగాన్ని విడుదల చేశారు. చిన్నారుల సాంస్కతిక కార్యక్రమాలు అలరించాయి. పలువురికి ఉగాది పురస్కారాలను కలెక్టర్ అందజేశారు. జిల్లా ప్రజలంతా సుఖసంతోషాలతో అభివృద్ధి వైపు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. ప్రగతిపథంలో జిల్లాను నడిపించేందుకు కృషి చేస్తానని చెప్పారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్ గౌడ్, ఏపీ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ దుర్గా ప్రసాద్ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో దేవదాయ శాఖలో సేవలు అందించిన నారాయణ శ్రీనివాసాచార్యులు, పవన్ కుమార్ అవధాని, ఫణి కుమార్ స్వామి, వేదాంత మురళీమోహన్, తెలుగు భాష వ్యాప్తిపై విశేష సేవలందిస్తున్న ఉపాధ్యాయులు చుండూరు వెంకటేశ్వర్లు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు పి. శ్రీరామచంద్రమూర్తి, ఎం. కోటేశ్వరరావు, అల్లూరి శివ కోటేశ్వరరావు, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి షాలేము రాజు, డీఆర్ఓ గంగాధర్ గౌడ్లకు ఉగాది పురస్కారాలను ప్రదానం చేశారు. బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా, ఉప కలెక్టర్ లవన్న, జిల్లా దేవదాయ శాఖ అధికారి ఎం. నాగయ్య తదితరులు పాల్గొన్నారు.


