బాపట్ల: రైతులు నేలలో మట్టి నమూనా పరీక్షలు చేయించి, పోషక లోపాలను గుర్తించాక నివారణ చర్యలను చేపట్టడంలో జాగ్రత్తలు తీసుకోవాలని పంటల శరీర ధర్మశాస్త్ర విభాగాధిపతి డా.కె.జయలలిత అన్నారు. వ్యవసాయ కళాశాలలో ప్రధాన పంటలలో వచ్చే పోషకాల లోపాలు నివారణ అంశంపై జరిగిన రైతు శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఎరువులను అధికంగా వాడినా, తక్కువగా వాడినా అవి నేలపై ప్రతికూల ప్రభావాన్ని చూపెడతాయని తెలిపారు. నేలను పరిశీలించిన అనంతరం వచ్చిన నివేదికల ఆధారంగా ఎరువుల మోతాదులను నిర్ణయిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. నత్రజని, భాస్వరం, పోటాష్ వంటి ప్రధాన పోషకాలను నేలకు సమతుల్యంగా అందించాలన్నారు. రసాయన ఎరువులతోపాటు సేంద్రియ ఎరువులను వాడితే నేల సారవంతం అవుతుందని తెలిపారు. రైతులు ఆధునిక సాంకేతిక పద్ధతులను ఆచరిస్తూ శాస్త్రవేత్తల సూచనలను పాటిస్తే తక్కువ ఖర్చుతోనే ఎక్కువ దిగుబడులను పొందవచ్చన్నారు. గోవిందపురం, పూండ్ల గ్రామాలకు చెందిన రైతులు ఈ శిక్షణలో పాల్గొని తగు సూచనలను పొందారు. ఈ కార్యక్రమంలో ఐసీఏఆర్ఎస్సీ ఉప ప్రణాళిక కో ఆర్డినేటర్ డాక్టర్ బి.అపర్ణ, డాక్టర్ జి.విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


