రేపు కౌన్సిల్ బడ్జెట్ సమావేశం 17వ తేదీతో ముగియనున్న పాలకవర్గ పదవీ కాలం మొండి బకాయిల మాటేంటో? అధికారులకు తలనొప్పిగా మారిన బినామీ బకాయిలు
మా వంతు ప్రయత్నం మేం చేస్తున్నాం
చీరాల అర్బన్: పాలకవర్గం పారదర్శకంగా పని చేయాలి. ప్రజల పక్షాన నిలవాలి. కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పట్టణ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతినిధులుగా గళం విప్పాలి. తప్పొప్పులపై సమగ్ర చర్చ జరగాలి. అంతిమంగా పురప్రజల ప్రయోజనాలు, పట్టణ అభివృద్ధే లక్ష్యంగా పాలకులు, అధికారుల అడుగులు ఉండాలి. వైఎస్సార్ సీపీ హయాంలో ఆ పంథా నడిచింది. అయితే టీడీపీకి పాలకవర్గం పగ్గాలు అందాక వాటికి తిలోదకాలు ఇచ్చారు. ప్రజా సమస్యలను, పట్టణాభివృద్ధికి గాలికి వదిలేశారు. కనీసం నెలకు ఒకసారి నిర్వహించే కౌన్సిల్ సాధారణ లేదా అత్యవసర సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించడంలో విఫలమయ్యారు. గత రెండు నెలలు కౌన్సిల్ సమావేశాలు జరగకపోవటం అందుకు నిదర్శనం. టీడీపీలోని అంతర్గత కుమ్ములాటలే కారణమని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. వారి విభేదాలతో ప్రజా ప్రయోజనాలను గాలికి వదిలేయటం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
భారీ మొత్తంలో బకాయిలు
పన్నులు, అద్దెలు వసూళ్లకు సంబంధించి పాలకవర్గానికి చెందిన వలువురికి బినామీలుగా ఉన్నవారి మొండి బకాయిలు అధికారులకు తలనొప్పిగా మారాయి. స్థానిక గడియార స్తంభం సెంటర్లోని రావు గారి బిర్యానీ హౌస్ బకాయి సుమారు రూ.40 లక్షల వరకు ఉంది. ఆ హోటల్ నిర్వాహకుడు చైర్మన్ మించాల సాంబశివరావుకు బినామీ కావటంతో అధికారులకు ఆ బకాయి వసూలు చేయటం కష్టతరంగా మారిందనే ప్రచారం జరుగుతోంది. ఇలానే మరికొన్ని మొండి బకాయిలు ఉన్నట్లు సమాచారం. మున్సిపల్ పాలకవర్గానికి గురువారం జరగబోయే బడ్జెట్ సమావేశం దాదాపు చివరిది కావచ్చు. 17వ తేదీతో వారి పదవీకాలం ముగియనుండటం అందుకు కారణం. మధ్యలో రెండు నెలలు కౌన్సిల్ సమావేశాలు జరగలేదు. అది ప్రత్యక్షంగా చైర్మన్ సాంబశివరావు, పరోక్షంగా ఎమ్మెల్యే కొండయ్యల వైఫల్యమేనని ప్రజలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో కనీసం చివరి సమావేశంలోనైనా మొండి బకాయిల వసూళ్లకు సంబంధించి మాట్లాడతారా.. మమ అనిపిస్తారా.. అనే చర్చ జనాల్లో నడుస్తోంది. హుందాగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. మొండి బకాయిలుగా గుర్తింపు పొందినవి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రాజకీయ నేపథ్యం ఉన్న వారివే సింహభాగం ఉన్నాయి. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే బకాయిలు ఉండకూడదు... ముందస్తుగా చెల్లించండని హితోపదేశం చేస్తున్నారు.
పన్నులు, అద్దె బకాయిల వసూళ్లుకు మా వంతు బాధ్యతలు మేం నిర్వహిస్తున్నాం. రావు గారి బిర్యానీ హౌస్కు సంబంధించిన బకాయి కూడా ఒకటి, రెండు రోజుల్లో మున్సిపల్ ఖజానాకు జమయ్యేలా కార్యాచరణ చేపట్టాం. అందరూ బకాయిలు చెల్లించి సహకరించాలని కోరుతున్నాం. బకాయిలు ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులన్న విషయాన్ని కూడా గుర్తెరగాలని సూచిస్తున్నాం.
– మాల్యాద్రి, ఆర్ఓ, చీరాల మున్సిపాలిటీ


