కోనూరు(అచ్చంపేట): మండలంలోని కోనూరులో గోపయ్య సమేత తిరుపతమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలు గురువారం అర్ధరాత్రి వరకు అత్యంత వైభవంగా జరిగాయి. వేకువజాము నుంచి ప్రారంభమైన మహోత్సవాలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. వైఎస్సార్సీపీకి చెందిన విద్యుత్ ప్రభ సందర్శకులను ఎంతో ఆకట్టుకుంది. ప్రభను విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా అలంకరించారు. జెడ్పీటీసీ సభ్యుడు తమ్మ విజయప్రతాపరెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందారు. పలు గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి తిరునాళ్ల మహోత్సవాన్ని తిలకించారు.
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధి సీతానగరంలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై విఘ్న విమోచక హనుమాన్ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 108 కలశాలతో పంచగవ్య శుద్ధి, సాయంత్రం విశేష తదీయారాధనతో కార్యక్రమాలు ముగిశాయి. మైహోం గ్రూప్స్ అధినేత జూపర్లి రామేశ్వరరావు, శ్రీకుమారి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ పరహంస పరివ్రాజకులు త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈనెల 8వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నామని తెలిపారు. ప్రతిరోజూ సుందరకాండ పారా యణ, గోపూజ, హనుమాన్ చాలీసా పారాయ ణ, అఖండ హరేరామ నామ సంకీర్తన, హనుమద్ పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
మట్టి తరలిస్తున్న లారీలు సీజ్
తాడేపల్లి రూరల్: రాజధాని ప్రాంతం నుంచి అక్రమంగా తరలిపోతున్న మూడు మట్టి లారీలను నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ శుక్రవారం సీజ్ చేశారు. అనంతరం ఆ లారీ యజమానులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు సమాచారం. డీఎస్పీ మురళీకృష్ణ ఒక కేసు విషయమై ఉండవల్లి నుంచి వస్తుండగా వరుసగా మట్టి లారీలు పెద్దపెద్దగా హారన్లు కొట్టుకుంటూ అధిక వేగంతో రావడంతో ఆ లారీలను క్రాస్ చేసి ఉండవల్లి సెంటర్ లో నిలిపివేశారు. మూడు లారీల వద్ద సరైన ప త్రాలు లేకపోవడంతో తాడేపల్లి పోలీస్స్టేషన్ కు పంపించి విచారణ చేయాలని ఆదేశించారు.
స్పాట్ వాల్యూయేషన్ కేంద్రం పరిశీలన
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా గుంటూరు సాంబశివపేటలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జరుగుతున్న స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాన్ని ఇంటర్మీడియెట్బోర్డు కార్యదర్శి, కమిషనర్ పి.రంజిత్బాషా శుక్రవారం పరిశీలించారు. బోర్డు నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ఆన్సర్ షీట్ల వాల్యూయేషన్ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఆర్జేడీ జె.పద్మ, ఆర్ఐవో జి.సునీత ఉన్నారు.


