
రొయ్య రైతుకు ధరాభారం
రొయ్య రైతులను ఎగుమతి వ్యాపారులు, కంపెనీలు ట్రంప్ సుంకాల పేరుతో వంచిస్తున్నా కూటమి సర్కారుకు చీమకుట్టినట్లు కూడా లేదు. ఆది నుంచి రైతులంటే గిట్టని బాబు సర్కార్ రొయ్య రైతులను పట్టించుకోకుండా గాలికి వదిలేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ధరలు స్థిరంగా ఉండేలా చూసి నష్టపోకుండా చర్యలు తీసుకున్నారు. వారికి సబ్సిడీతో విద్యుత్ అందించారు. ఇప్పడు కూటమి ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా విద్యుత్ చార్జీల భారాన్ని మోపి రొయ్య రైతులను ఇబ్బందులను గురిచేస్తోంది.
సాక్షి ప్రతినిధి, బాపట్ల: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకం బూచి చూపి ఎగుమతి దారులు, కంపెనీలు రొయ్యల ధరలను అమాంతం తగ్గించడంతో రైతులు లబోదిబో మంటున్నారు. ధరలు పతనం కావడంతో జిల్లాలో 60 శాతానికి పైగావున్న కౌలు రైతులు మరింతగా నష్టపోతున్నారు. పెట్టుబడి రాని పరిస్థితిలో ఆందోళన చెందుతున్నారు. నెల రోజుల క్రితం వనామీ 100 కౌంట్ ధర రూ. 270 ఉండగా ప్రస్తుతం రూ.225కు తగ్గింది. టైగర్ రొయ్య 20 కౌంట్ ధర నెల రోజుల క్రితం రూ. 680 ఉండగా ప్రస్తుతం 570కి తగ్గింది. ఈ లెక్కన నెలరోజుల్లో వనామీ ధర రూ. 45, టైగర్ ధర రూ. 100 తగ్గింది. దీనివల్ల లాభాల సంగతి దేవుడెరుగు పెట్టు బడులు కూడా రావని రైతులు గగ్గోలు పెడుతున్నారు.
పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు
రొయ్యల సాగు పెట్టుబడులు ఏడాది కేడాదికి పెరుగుతున్నాయి. విద్యుత్ బిల్లులు రెట్టింపవగా, జీవ రసాయన మందుల ధరలు అయాంతం పెరిగాయి. పెరిగిన వర్కర్స్ జీతాలు దీనికి తోడయ్యాయి. దీంతో ఎకరం రొయ్యల సాగుకు రూ.4లక్షల నుంచి 5 లక్షల ఖర్చవుతోంది. ఈ లెక్కన పెట్టుబడులు రావాలంటే వనామీ 100 కౌంట్ కౌలు రైతు అయితే రూ. 250 అమ్మాలి. సొంత రైతు అయితే రూ.225 అమ్మాలి. కానీ ప్రస్తుతం ధరలు అంతకు మించి తగ్గాయి. దీంతో లాభాల సంగతి దేవుడెరుగు పెట్టుబడులు వచ్చే పరిస్థితి కానరావడంలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు.
జిల్లాలో సాగు ఇలా..
జిల్లాలో రేపల్లె, నగరం, నిజాంపట్నం, పిట్టలవానిపాలెం, కర్లపాలెం, బాపట్ల, చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల పరిధిలో 12 వేల మంది రైతులు 21 వేల ఎకరాల్లో రొయ్యలు సాగుచేస్తున్నారు. ఇందులో 70 శాతం వనామీ సాగులో ఉండగా 30 శాతం టైగర్ రొయ్యను సాగుచేస్తున్నారు.
ట్రంప్ సుంకాల బూచి చూపి..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాల బూచి చూపి ఎగుమతి దారులు, కంపెనీలు రైతులను నిలువునా ముంచుతున్నాయి. వాస్తవానికి 100 కౌంట్ రొయ్య అమెరికాకు వెళ్లదు. కేవలం 20, 30, 40, 50 కౌంట్ రొయ్యలు మాత్రమే ఎగుమతి అవుతున్నాయి. జిల్లాలో వనామీలో అధికంగా 100 కౌంట్ రొయ్యల విక్రయాలు మాత్రమే సాగుతున్నాయి. వనామీ 100 కౌంట్ రొయ్య చైనా, గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతోంది. అమెరికాకు రొయ్య ఎగుమతి కాకుండానే ఎగుమతి దారులు, వ్యాపారులు ట్రంప్ సుంకాల పేరుతో ఇబ్బడి ముబ్బడిగా ధరలు తగ్గించి రొయ్య రైతును దోపిడీ చేస్తున్నారు. ఒక్క కిలోకు రూ. 45 తగ్గితే ఎకరాలో వచ్చే దిగుబడి 1.50 టన్నులు అనుకున్నా రూ. 70 వేలకు పైగా నష్టం వస్తుండగా కౌలు రైతుకు రూ. 1.20 లక్షల నుంచి 1.70 లక్షల నష్టం వస్తోంది.
టైగర్ ధర
రూ.570
(20 కౌంట్)
తగ్గిన ధర
రూ. 100
వనామీ ధర:
225 (వంద కౌంట్)
నెలలో తగ్గిన ధర:
రూ. 50
రూ.లక్ష
(ఎకరాకు)
పట్టించుకోని
ట్రంప్ సుంకాల బూచి చూపి ధరల తగ్గింపు అమెరికాకు 100 కౌంట్ రొయ్యల ఎగుమతి లేకపోయినా ధర తగ్గింపు జిల్లాలో 21 వేల ఎకరాల్లో రొయ్యల సాగు 70 శాతం వనామీ, 30 శాతం టైగర్ సాగు సాగు దారుల్లో 60 శాతం మంది కౌలు రైతులే.. ఎగుమతి కంపెనీలు, వ్యాపారులు కలిసి వంచిస్తున్నారంటూ రైతుల గగ్గోలు
ఎకరాకు రూ.లక్షపైనే నష్టం
రొయ్యల ఉత్పత్తి బాగా ఉంటే ఎకరానికి 2 టన్నులు దిగుబడి ఉంటుంది. ప్రస్తుతం సగటున ఎకరానికి 1.50 టన్నులకు మించి దిగుబడి రావడంలేదు. ఈ లెక్కన వున్న ధరతో ఎకరాకు రూ. 3.50 లక్షలకు మించి రాబడి వుండడంలేదు. దీంతో ఎకరాకు సొంత రైతుకు రూ.లక్షకు తగ్గకుండా, కౌలు రైతు రూ. 1.50 లక్షల నుంచి 2 లక్షల వరకు నష్టపోవాల్సి వస్తోంది. ఎకరం కౌలు చెరువులనుబట్టి రూ. 50 వేల నుంచి రూ. 1లక్ష ఉంది. కౌలు రైతులకు వడ్డీలు అదనపు భారంగా మారనున్నాయి. దీంతో రొయ్య రైతులు లబోదిబోమంటున్నారు.

రొయ్య రైతుకు ధరాభారం

రొయ్య రైతుకు ధరాభారం

రొయ్య రైతుకు ధరాభారం