అధికారులతో మాట్లాడుతున్న కార్పొరేషన్ కమిషనర్ కీర్తి చేకూరి
నెహ్రూనగర్(గుంటూరు): ఓటుపై సందేహాల పరిష్కారానికి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, ఓటర్ల జాబితా నూరు శాతం పారదర్శకంగా ఉండేలా బీఎల్ఓలు, సూపర్వైజరి అధికారులు బాధ్యత తీసుకోవాలని, ఓటు పై సందేహాలను నివృత్తి చేసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి అధికారులకు స్పష్టం చేశారు. బుధవారం కమిషనర్ చాంబర్ లో ఎన్నికల విధులపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల ఓటర్లకు తమ ఓటుకు సంబంధించిన ఏ సందేహం ఉన్నా తీర్చడానికి వీలుగా నగరపాలక సంస్థ ప్రదాన కార్యాలయంలో హెల్ప్ డెస్క్ని గురువారం నుంచి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఓటర్లు తమ ఓటుకి సంబంధించి హెల్ప్ డెస్క్ కి వచ్చి తెలుసుకోవచ్చని లేదా 0863–2345104, 2345105 నంబర్లకు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:30 గంటల లోపు ఫోన్ చేసి కూడా తెలుసుకోవచ్చన్నారు. ఓటర్ల జాబితా నూరు శాతం పారదర్శకంగా ఉండేలా బిఎల్ఓలు, సూపర్వైజరి అధికారులు భాధ్యత తీసుకోవాలని, నిర్లక్ష్యంగా ఉండే అధికారులు, బీఎల్ఓలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బీఎల్ఓలు తమ పరిధిలోని ఓటర్ల జాబితాపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఓటర్లు జాబితా పై అడిగే సందేహాలను పరిష్కరించాలని ఆదేశించారు. నగరంలోని పోలింగ్ కేంద్రాలకు నంబరింగ్ పూర్తి అయిందని, సూపర్వైజరీ అధికారులు తమ పరిధిలోని కేంద్రాలను పరిశీలించి, ఎక్కడైనా నంబరింగ్ లేకుంటే పట్టణ ప్రణాలిక అధికారులతో సమన్వయం చేసుకుని పూర్తి చేయాలన్నారు. ఓటర్ల జాబితా, ఓటు పై అందే ఫిర్యాదులు, ఫారాలు ఎప్పటికప్పుడు పరిష్కరించేలా ఎన్నికల విభాగం శ్రద్ధ చూపాలని, అవసరమైతే అదనపు ఆపరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. బీఎల్ఓలు ఇస్తున్న ఫారాలను ఏఈఆర్ఓలు నేరుగా క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. విధుల్లో వెనుకబడిన బీఎల్ఓలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, నిర్లిప్తత ఉండకూడదన్నారు. సమావేశంలో ఇంచార్జ్ అదనపు కమిషనర్ సి.హెచ్.శ్రీనివాస్, డెప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, టి.వెంకట కృష్ణయ్య, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, డెప్యూటీ సిటి ప్లానర్ కోటయ్య, ఎలక్షన్ సెల్ సూపరిండెంట్లు ప్రసాద్, సాంబశివరావు, పద్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment