గుర్రంకొండ: మండలంలోని తరిగొండలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి హుండీ ద్వారా రూ. 8,09,425 ఆదాయం వచ్చింది. గురువారం స్థానిక ఆలయప్రాంగణంలో టీటీడీ అధికారుల సమక్షంలో స్వామివారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. నాలుగునెలల కాలానికి సంబంధించి రూ.8,09,425 ఆదాయం వచ్చినట్లు అధికారులు తేల్చారు. టీటీడీ ఏఈవో గోపినాథ్, విజిలెన్స్అధికారులు, టీటీడీ ఆధికారి నాగరాజ, ఆలయ అర్చకులు గోపాలాబట్టర్, కృష్ణ, రాజు, గోకుల్, వరదరాజ స్వాములు పాలల్గొన్నారు.
నేడు మంత్రి రాక
కడప సెవెన్ రోడ్స్ : రాష్ట్ర రోడ్డు, భవనాలు, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్థన్రెడ్డి శుక్రవారం కడప జిల్లా పర్యటనకు రానున్నారని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఉదయం 10.30గంటలకు పులివెందులకు చేరుకుంటారు. సాయంత్రం వరకు స్థానిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనంతరం కడపకు చేరుకుని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో బస చేస్తారు. శనివారం ఉదయం పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి ప్రసంగించనున్నారు.
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లాకు చెందిన దిగువ పేర్కొన్న వారిని వివిధ హోదాలలో నియమిస్తున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. జిల్లా బీసీ విభాగం కార్యదర్శులుగా బత్తల వీరాంజనేయులు, ఎం. రమణ, ఎస్సీ విభాగం ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఎం. రవి ప్రసాద్, సి. వెంకట రమణ, కె. సురేష్, లక్కిరెడ్డిపల్లె మండల ప్రధాన కార్యదర్శిగా సిద్దక నాగిరెడ్డి, రామాపురం మండల ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా దేవరావుల రమేష్లను నియమించారు.
పెద్దమండ్యం: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఫిన్లాండ్ విద్యా విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు పెద్దమండ్యం మండలం గుడిశవారిపల్లె ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్.సిద్ధారెడ్డి ఎంపికయ్యారు. అంతర్జాతీయంగా విద్యా రంగంలో ప్రథమ స్థానంలో ఉన్న ఫిన్లాండ్లోని వినూత్న బోధనా పద్ధతులను నేరుగా అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ తరఫున రాష్ట్రవ్యాప్తంగా 29 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసింది. ఇందులో మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న సిద్ధారెడ్డికి ఈ అరుదైన విదేశీ యాత్ర అవకాశం లభించింది. అక్కడ విజయవంతంగా అమలవుతున్న విద్యా విధానాలను అధ్యయనం చేసి, మన రాష్ట్ర పాఠశాలల్లో వాటిని ప్రయోగాత్మకంగా అమలు చేయడమే ఈ విదేశీ అధ్యయన యాత్ర ముఖ్య ఉద్దేశమని డీఈవో సుబ్రమణ్యం తెలిపారు. ఎంపికై న ఉపాధ్యాయుల బృందం ఈ నెల 15 నుంచి 28వ తేదీ వరకు ఫిన్లాండ్ దేశంలో పర్యటించి అక్కడి విద్యా ప్రమాణాలను పరిశీలించనుంది. 2000 సంవత్సరంలో ఉపాధ్యాయుడిగా ప్రస్థానం ప్రారంభించిన సిద్ధారెడ్డి, 2025 వరకు మూడు సార్లు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ‘ఉత్తమ ఉపాధ్యాయుడి’గా ఎంపికయ్యారు. హెచ్ఎం సిద్ధారెడ్డిని సహచర ఉపాధ్యాయులు, అధికారులు, పాఠశాల విద్యా కమిటీ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.


