మదనపల్లె సిటీ: జిల్లా ఆర్థిక ప్రగతికి బ్యాంకర్లు విరివిగా రుణాలు అందించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ బ్యాంకర్లను ఆదేశించారు. మంగళవారం మదనపల్లె కలెక్టరేట్లోని బీసీ హాలులో కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ కన్సల్టెటివ్ కమిటీ(డీసీసీ), డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ (డిఎల్ఆర్సీ) బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 2026–27కు రూ.18,013 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక ఆమోదించడం జరిగిందన్నారు. ఇందులో ప్రాధాన్యతరంగానికి రూ.14,503 కోట్లు, వ్యవసాయరంగానికి రూ12,654 కోట్లు కేటాయించడం లక్ష్యమన్నారు. కేటాయించిన రుణ లక్ష్యాలను బ్యాంకర్లు తప్పనిసరిగా అధిగమించాలని సూచించారు. పారిశ్రామికరంగంలో ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు త్వరితగతిన రుణాలు అందించాలని తెలిపారు. ఆర్థిక చేకూర్పులో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో బ్యాంకు బ్రాంచ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్థిక అక్షరాస్యతపై విస్తృత అవగాహన కల్పించాలని ఎల్డీఎంకు సూచించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. రుణ పథకాలకు అర్హత పొందిన లబ్ధిదారులకు పెండింగ్ లేకుండా రుణాలు అందించాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు. సురక్షితమైన డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలన్నారు. లీడ్ బ్యాంకు మేనేజర్ ఆంజనేయులు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని బ్యాంకులకు 2025–26 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి నిర్దేశించిన పలు రకాల రుణాల లక్ష్యాలు, సాధించిన ప్రగతి, 2026–27 ఆర్థిక సంవత్సరానికి లక్ష్యాలపై డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశంకు సంబంధించిన అజెండా వివరాలను, ఆయా అంశాలలో బ్యాంకు సాధించిన ప్రగతిని కలెక్టర్కు వివరించారు. సమావేశంలో ఏఎల్డీఎం మంజునాథ్, నాబార్డ్ డీడీఎం పృధ్వి, ఆర్బీఐ ఎల్డీఓ ఎలమంద, యూనియన్ బ్యాంకు ఆర్ఎం తులసీ, వివిధ బ్యాంకు మేనేజర్లు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్


