భూమికి సంబంధించిన అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయని, అక్కడే ఉన్న పోలీసులకు చెబుతున్నా వారివైపు నుంచి ఎలాంటి సహకారం లభించకపోగా ఇక్కడే ఉంటే దాడులు చేయడమే కాదు మేము కూడా మీ మీద కేసులు పెట్టాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించి పంపించడంపై ఎంపీపీ రాజమ్మ తీవ్రంగా మనస్థాపానికి గురయ్యారు. న్యాయాన్ని కాపాడాల్సిన పోలీసులే దౌర్జన్యాలకు అండగా నిలవడం ఎంతవరకు సమంజసమంటూ మీడియా ముందు ఎంపీపీ విలపించారు. మంగళవారం ఉదయం నుంచి టీడీపీ నాయకులు, గ్రామ సర్పంచ్ వాసు, విజయ్, నాగేంద్ర కుమార్, రామాంజి, చిట్టి, హరిలు గుడారాలు వేసుకొని మా భూమి ఆక్రమణకు పాల్పడుతున్నారని ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించడానికి వచ్చిన తమపై తమ పిల్లలపై పీకలదాకా మద్యం సేవించి భయానక వాతావరణం సృష్టించి కొడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇరవై సంవత్సరాలుగా తమ ఆధీనంలో పొలం సాగుచేసుకుంటున్నామని.. ఇప్పుడు ఆ భూమిని తెలుగుదేశం నాయకులు దౌర్జన్యంగా ఆక్రమించడం ఎంతవరకు సమంజసమని, ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలంటూ ఎంపీపీ మీడియా ద్వారా మొరపెట్టుకున్నారు. బీసీ నాయకుడు వల్లపు రమేష్ మాట్లాడుతూ రాయచోటి రూరల్ మండలం, పెమ్మాడపల్లి పంచాయతీలో సర్వే నెంబరు 511/1లో 2005లో పల్లపు రాజమ్మ పేరున ఒక ఎకరం డీకేటీ పట్టాను ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఈ భూమిని స్థానిక తెలుగుదేశం నాయకులు దౌర్జన్యంగా ఆక్రమణకు పాల్పడ్డారన్నారు. భూమిపై సర్వే హక్కులు తమకు ఉన్నాయని, ఆధారాలతో ముందుకు వస్తే తమను, తన భార్య రాజమ్మను రెండుసార్లు కొట్టి పంపారన్నారు. తమ భూమిలో ఎలాంటి వివాదాలు లేకపోయినా వారు చేస్తున్న దౌర్జన్యాలకు పోలీసులు కూడా వారికే మద్దతు పలుకుతుండడం దారుణమన్నారు. పది సంవత్సరాలుగా వైఎస్సార్ సీపీ తరపున ఎంపీపీగా కొనసాగుతున్న పల్లపు రాజమ్మ, వైఎస్సార్ సీపీ నాయకులు కావడంతోనే దౌర్జన్యంగా టీడీపీ నాయకులు భూ కబ్జాలకు తెరతీశారని రమేష్ ఆరోపించారు.


