● అధికారం కోసం హామీలు..
వచ్చాక వెన్నుపోటు
● జగనన్న కోసం జనం ఎదురుచూస్తున్నారు
● మదనపల్లెలో వెన్నుపోటుకు
రెండేళ్లపై వైఎస్సార్సీపీ సదస్సు
సాక్షి, మదనపల్లె: తమను పాలించాలని ఐదేళ్లు అధికారం ఇచ్చినప్పటికీ కూటమి ప్రభుత్వం రెండేళ్లకే ప్రజా విశ్వాసం కోల్పోయిందని వైఎస్సార్సీపీ సహా ప్రతిపక్ష పార్టీల నాయకులు పేర్కొన్నారు. సోమవారం మదనపల్లెలోని దేశాయి ఫంక్షన్ హాల్లో వెన్నుపోటుకు రెండేళ్లపై ప్రతిపక్ష పార్టీలతో వైఎస్సార్సీపీ సదస్సు నిర్వహించింది. సమన్వయకర్త నిసార్ అహ్మద్ అధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు హాజరైన వివిధ వర్గాల నాయకులు, మహిళా నాయకులు రెండేళ్ల కూటమిపాలన తీరుపై విరుచుకుపడ్డారు. ఇది ప్రజా పాలన కాదు ప్రజా కంటక పాలన, ప్రజలను నట్టేట ముంచే ప్రభుత్వం అంటూ ఘాటుగా విమర్శించారు. ఈ రెండేళ్లలో ఏ ఏ వర్గాలు ఎలా నష్టపోయాయి, ప్రజలకు దూరమైన సంక్షేమం, నిరుపేదలు ఎదుర్కొంటున్న నిత్యవసర భారం, విద్యార్థులు, రైతులు, కార్మికులు, రైతు కూలీలు, వ్యాపారులు, ఇలా అన్ని వర్గాలకు కూటం ప్రభుత్వం ఎలా వెన్నుపోటు పొడిచిందో విడమరిచి తమ ప్రసంగాల్లో వివరించారు.
అన్ని రంగాల్లో వైఫల్యం
రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో ఒక్క రంగంలోనూ ప్రజా రంజక పాలన అందించలేదని నాయకులు మండిపడ్డారు. రైతు భరోసా ఏడాదికి రూ.20వేలు ఇస్తామని ఒక ఏడాది ఇవ్వలేదు, తల్లికి వందనం పేరుతో అదే మోసం చేశారు. సూపర్ సిక్స్ అన్నారు, ఇవి ఎవరికి అందాయి, ఎవరికి ఇచ్చారో చెప్పేవన్నీ కాకి లెక్కలు, జగనన్న ఇచ్చిన పథకాలతో వీటిని ప్రజలు పోల్చుకోవడం లేదని పేర్కొన్నారు. లేని నిబంధనలు, కోతలతో పథకాలకే వాతలు పెట్టిన ఘనత చంద్రబాబు సర్కారుదని దుయ్యబట్టారు.
నిరుద్యోగులకు నిండా మోసం
జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం, ఉద్యోగాలు ఇస్తామని నమ్మించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తోందని నిలదీశారు. మెగా డీఎస్సీ పేరుతో దగా డీఎస్సీ నిర్వహించి నిరుద్యోగులతో చెలగాటమాడడం చంద్రబాబుకే దక్కిందన్నారు. వికలాంగులకు సదరన్ స్లాట్ కష్టాలు తీరలేదన్నారు. ఎరువులు నల్ల బజార్లో వెళ్తున్నా, ధరలు మండుతున్నా చంద్రబాబు సర్కార్ ఏం చేసిందని ప్రశ్నించారు.జగనన్న పాలనలో పేదల భూములకు ఫ్రీ హోల్డ్ చేస్తే అది అక్రమం, చంద్రబాబు సర్కార్ ఎకరా 99 పైసలకు భూములు ఇస్తే అది సక్రమం అవుతుందా అని నిలదీశారు. అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని అన్నారు. జగనన్న పాలనలో ఎక్కడైనా మహిళలకు ఇబ్బంది కలిగితే పోలీసులు నిమిషాల్లో చేరుకుని కాపాడేవారు. ఇప్పుడు చిన్నారులు, మహిళలు తేడా లేకుండా వారిపై అఘాయిత్యాలు జరుగుతున్నా అడ్డుకట్ట వేయలేకపోతున్నారని మహిళా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సంక్షేమం విషయంలో జగనన్న పాలనతో చంద్రబాబు సర్కార్ అంచుల్లో కూడా లేదని స్పష్టం చేశారు.
సదస్సు సక్సెస్
మదనపల్లెలో నిర్వహించిన వెన్నుపోటుకు రెండేళ్లు సదస్సుకు మంచి స్పందన లభించింది. సీపీఐ, ఆప్ ప్రతినిధులు, మేధావులు, యువజన నాయకులు, మహిళా ప్రతినిధులు హాజరై తమ వాణి వినిపించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ దురాగతాలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంది. అందరూ ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వీఎస్.రెడ్డి, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి సయ్యద్ రెహామాన్, నాయకులు రాజేంద్ర నాయుడు, కేశవ రెడ్డి, ఆర్ఐ.రమణారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మస్తాన్ ఖాన్, డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, వెలుగు చంద్ర, బీరంగి రేవతి, వినూతబాయి, రేణుక, రాధాకష్ణ, సురేంద్ర, జయభారత్, రెడ్డి శేఖర్ రెడ్డి , సురేంద్ర, ఆవుల మల్లికార్జున, ప్రసాద్ బాబు, శ్రీనివాసులు, ఎన్.ఇర్ఫాన్ ఖాన్, ఈశ్వర్ నాయక్, చిప్పిలి మల్లికార్జున రెడ్డి, మధు, షేక్ ఇర్ఫాన్, శీలం రమేష్ , కొత్తపల్లి మహేశ్ , శారదా రెడ్డి, శ్యామల, అపర్ణ, నాగమణి , ధనలక్ష్మి, మంజుల, అమ్మాజాన్, మేరీ, బండపల్లి వెంకట రమణ, యూనస్, తాజ్ భాషా, అబ్దుల్లా, శరత్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, నాగరాజ రెడ్డి, రమణ, వడిగల శ్రీకాంత్, చరణ్, షేక్ జబి, కోటూరు ఈశ్వర్, మహమ్మద్ ఖాన్, విష్ణువర్ధన్ రెడ్డి, జి వి . ప్రసాద్, ఎం.ఫిర్దౌస్ ఖాన్, మజ్జిగ కేశవ యాదవ్, ఆవుల విశ్వనాథ్, చీకలబైలు చంద్ర, చలపతి, సత్తార్, తాళే సుబ్రహ్మణ్యం, వేణుగోపాల్ రెడ్డి, సమద్ , సాధిక్, భాను, మహేశ్ పాల్గొన్నారు.
వెన్నుపోటుకు రెండేళ్లు సదస్సులో పాల్గొన్న నిసార్ అహ్మద్, తిప్పారెడ్డి తదితరులు, సదస్సుకు హాజరైన వివిధ వర్గాల ప్రతినిధులు


