ఎక్కడ ఖాళీ జాగా కన్పించినా పచ్చ నేతల కన్నుపడుతోంది. ప్రభుత్వ స్థలాల కోసం తెగబడుతున్నారు. ఓ కీలక ప్రజాప్రతినిధి పేరుతో గ్యాంగులతో భూ కబ్జాలకు రెచ్చిపోతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే మీవల్ల అయ్యేది చేసుకోండంటూ బెదిరిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని పట్టణంలోని కోళ్లబైలు గ్రామం వైఎస్సార్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఊరంతా కదిలి కలెక్టరేట్ పీజీఆర్ఎస్కు వచ్చారు. సర్వే నంబర్ 669లో 2008 కాలనీ మంజూరు కాగా 15 సెంట్లు కమ్యూనిటీ పర్పస్ కోసం కేటాయించారు. రూ. కోటికి పైగా విలువ చేసే దీనిని కొట్టేయడానికి ఓ ప్రముఖ ప్రజాప్రతినిధి పేరుతో భూ కబ్జా గ్యాంగ్లు యత్నిస్తున్నారని కాలనీ వాసులు జిల్లా కలెక్టర్కు విన్నవించారు. ఈ స్థలం కబ్జా కాకుండా గుడి, బడి, అంగన్వాడీ, హాస్పిటల్ లేదా వాటర్ ట్యాంక్ లాంటి ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించాలని కోరారు. ఇందుకు జిల్లా కలెక్టర్ స్పందిస్తూ అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.


