సాక్షి, మదనపల్లె : రాష్ట్రంలో ఏకై క వేసవి విడిది కేంద్రం బి.కొత్తకోట మండలంలోని హార్సిలీ హిల్స్. దీని అభివృద్ధి కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో నిధులు మంజూరు చేసింది. టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్కు పనులు అప్పగించింది. మొదట్లో వేగంగా ప్రారంభమైన పనులు..తర్వాత కూటమి అధికారంలోకి రావడంతో మందగించాయి. దీనివల్ల పర్యాటకశాఖ భారీగా ఆదాయం నష్టపోతోంది. చంద్ర బాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
రూ.9.13 కోట్లతో పనులు
హార్సిలీహిల్స్ అభివృద్ధి, అతిథి గృహాల ఆధునికీకరణపై గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపింది. దీంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇస్తూ రూ.9.13 కోట్ల నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న బి బ్లాక్, ఎన్జీవో బ్లాక్, యాత్రీ నివాస్, కాటేజీల ఆధునికీకరణతోపాటు కొత్తగా టూరిజం రెస్టారెంట్ నిర్మాణం కోసం ఈ నిధులు ఇచ్చారు. హైదరాబాద్కు చెందిన ఆర్.గంగయ్య అండ్ కో సంస్థ కాంట్రాక్టర్ పనులు దక్కించుకున్నాడు. ఈ పనులను 2024 ఏప్రిల్ నుంచి డిసెంబర్లోపు 9 నెలల్లో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్తో ఒప్పందం చేసుకుంది. వైల్డ్ విండ్స్ భవనంలోని 8, విండ్ విస్టిల్ భవనంలోని 6, విండ్ఫాల్ భవనంలోని 4 అతిథి గృహలను కాంట్రాక్టర్కు అప్పగించింది.
ఖర్చు చేసింది రూ.కోటే
రూ.9.13 కోట్ల నిధులను ఖర్చు చేయాల్సి ఉండగా కాంట్రాక్టు సంస్థ కేవలం రూ.కోటి విలువైన పనులు మాత్రమే చేసింది. విండ్ఫాల్, యాత్రీనివాస్కు చెందిన అతిథి గృహాలను మాత్రమే ఆధునికీకరించి మిగిలిన వాటిని వదిలేశారు. రూ.8.13 కోట్ల నిధులను ఖర్చు చేయలేదు. ఈ పరిస్థితుల్లో నిధులు నిష్ఫలమయ్యే పరిస్థితి ఏర్పడింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పర్యాటకశాఖకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఆ మేరకు నిధులు కూడా ఇచ్చింది. కూటమి ప్రభుత్వం ఈ నిధులను సద్వినియోగం చేసి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధి ఏ మాత్రం చూపలేదు.
9నెలల్లో రూ.55 లక్షల నష్టం
2024 ఏప్రిల్ నుంచి 18 అతిథి గృహాల ఆధునికీకరణ కోసం కాంట్రాక్టర్కు అప్పగించడంతో అవి పర్యాటకులకు అందుబాటులో లేవు. దీంతో ఈ గదులనుంచి టూరిజంకు తొమ్మిది నెలల్లో రూ.55 లక్షల నష్టం వాటిల్లింది. వీటి పనులు పూర్తి చేసి అప్పగించాల్సిన కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం వహించింది. 2024 డిసెంబర్లో పనులు పూర్తి చేసి అప్పగించలేదు. నెలల తరబడి జాప్యం జరిగింది. 2025లో కూడా కొంతకాలం అతిథిగృహాల కేటాయింపు జరగలేదు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.9.13 కోట్లతో ఆధునికీకరణ
రెస్టారెంట్ భవనం మంజూరు
కూటమిప్రభుత్వం వచ్చాక పనులపై కాంట్రాక్టర్ నిర్లక్ష్యం
రూ.కోటి పనులు చేసి వదిలేశారు
రూ.8.13 కోట్ల పనులు ప్రశ్నార్థకం


