● రూ.10 లక్షల నగదు, వాహనాలు స్వాధీనం
పులివెందుల రూరల్ : వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలోని పార్నపల్లె రోడ్డు కోతి సమాధి వద్ద పందులు, గొర్రెల దొంగల ముఠాను పులివెందుల పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం అర్బన్ పోలీస్స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో సీఐ శ్రీరామ్ వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీ నాయక్ ఆధ్వర్యంలో.. పందులు, గొర్రెల దొంగల ముఠాను అరెస్టు చేసి వారి నుంచి రూ.10 లక్షల నగదు, బుల్లెట్, బొలెరో వాహనాలతో పాటు పందులు, గొర్రెలను స్వాధీనం చేసుకున్నామన్నారు. దొంగల ముఠాను శనివారం పార్నపల్లె రోడ్డులోని కోతి సమాధి వద్ద అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశామన్నారు. నిందితులలో అనంతపురం జిల్లాకు చెందిన ఎరుకుల శ్రీరామ్, భాస్కర్, చంద్రశేఖర్, చిరంజీవి, రాజు, భరత్కుమార్ ఉన్నట్లు తెలిపారు. ద్విచక్రవాహనం చోరీ కేసులో శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలానికి చెందిన ఇర్ఫాన్ అను కూబాను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. బోడా శ్రీను, విజయ్ పరారీలో ఉన్నారన్నారు. వారిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. సమావేశంలో ఎస్ఐ తిమోతి, ఏఎస్ఐలు సిద్దార్థ, వర్మ, పోలీసులు పాల్గొన్నారు.


