రాయచోటి టౌన్ : రాయచోటి టౌన్ : శిక్షణ తరగతులలో పాల్గొనేందుకు వచ్చిన ఉపాధ్యాయులకు కనీస వసతులు కల్పించడంలో అధికారులు విఫలం అయ్యా రు. తాగేందుకు మంచినీరు లేదు, మధ్యాహ్నం కడుపునకు సరిపడా భోజనం పెట్టలేదు, ఈ విషయంపై ఈనెల 6న ‘ఉపాధ్యాయుల ఆకలికేకలు’ శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై అధికారులు స్పందించారు. ఉపాధ్యాయులకు అందిస్తున్న భోజన వసతులపై జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం దగ్గరుండి పర్యవేక్షించారు. నిర్వాహకులు ఉపాధ్యాయులకు భోజనం వడ్డించారు. ఉపాధ్యాయులు తిన్నాక చివర్లో డీఈఓ తిన్నారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మండే ఎండల తాకిడి నుంచి రక్షించేందుకు షామియానాలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే రద్దీని తగ్గించేందుకు ప్రత్యేకంగా మహిళలకు రెండు,పురుషులకు రెండు వేర్వేరుగా భోజనం కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ విషయం గురించి జిల్లావిద్యాశాఖాధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాయచోటి డివిజన్ పరిధిలోని ఉపాధ్యాయులు ఈ ట్రైనింగ్ సెంటర్లో పాల్గొనాల్సి ఉందని, అయితే సుండుపల్లె, వీరబల్లె మండలాలకు చెందిన ఉపాధ్యాయులు రాజంపేటకు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉండటంతో వారు కూడా వచ్చారన్నారు. దీంతో భోజన సౌకర్యం కల్పించడంలో ఇబ్బంది కలిగిందని, ఇకపై ఎలాంటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
ఉపాధ్యాయులకు భోజనం వడ్డించిన నిర్వాహకులు
మహిళలకు రెండు, పురుషులకు రెండు కౌంటర్లు ఏర్పాటు


