పుంగనూరు: మండలంలోని ఆరంట్లపల్లెకి చెందిన శ్రీరాములు (50) తన పొలంలో నేరేడు చెట్టు ఎక్కి కాయలు కోస్తూ ప్రమాదవశాత్తు కిందపడిన సంఘటన శనివారం జరిగింది. ఈ ప్రమాదంలో శ్రీరాములు తలకు బలమైన గాయమైంది. కుటుంబ సభ్యులు అతన్ని మదనపల్లె ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు.
బొలెరో ఢీకొని..
రామసముద్రం: రామసముద్రం మండలం కాప్పల్లి పంచాయతీ బ్రాహ్మణవారిపల్లి బస్టాప్ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రం కదిరేపల్లికి చెందిన శంకరప్ప (42) గాయపడ్డాడరు. ఇతను రామసముద్రం నుంచి మదనపల్లె మార్కెట్కు బైక్లో అల్లనేరేడు కాయలు తీసుకెళుతుండగా వెనుక నుంచి బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శంకరప్ప ఎడమ కాలికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని రామసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు.
వైఎస్సార్సీపీ నాయకుడి బైక్ దహనం
రొంపిచెర్ల: వైఎస్సార్సీపీ నాయకుడి ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని దుండగులు కాల్సి వేసినట్లు బాధితుడు మోహన్ రెడ్డి శనివారం తెలిపారు. బాధితుని కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజక వర్గంలోని రొంపిచెర్ల మండలం చల్లావారిపల్లె గ్రామ పంచాయతీ గెర్లపల్లెకు చెందిన చల్లావారిపల్లె గ్రామ పంచాయతీ వైఎస్సార్సీపీ కన్వీనర్ మోహన్ రెడ్డి తన (ఏపీ 03 ఏసీ 8615) ద్విచక్ర వాహనాన్ని ఈనెల 4వ తేదీ రాత్రి వ్యవసాయ పొలం వద్ద పెట్టాడు. రాత్రి గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి కాల్చి వేశారు. ఉదయం వెళ్లి చూడగా ద్విచక్ర వాహనం పూర్తిగా కాలి పోయిందన్నారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వారు కాల్చి వేశారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయమై రొంపిచెర్ల పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళ ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్: కుటుంబ సమస్యలతో మనస్తాపం చెందిన ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శనివారం చోటుచేసుకున్న ఘటనపై బాదితురాలి కుటుంబీకుల కథనం.. కురబలకోట మండలం, అంగళ్లుకు చెందిన రమణమ్మ (45) కూలి పనులు చేస్తుండేది. కుటుంబ సమస్యలతో మనస్తాపం చెంది, ఇంట్లో ఉన్న విషం తాగింది. గమనించిన స్థానికులు బాధితురాలిని 108 వాహనంలో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పింది.


