
వేడుకున్నా ఓటు వేయనివ్వలేదు.. ఇదో ఎన్నికా?
రాజంపేట రూరల్: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో కూటమి ప్రభుత్వం నాయకులు ఎన్నికల నియమావళిని అభాసుపాలు చేశారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక ఆకేపాటి భవన్లో మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి, నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆకేపాటి శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశ చరిత్రలో ఇటువంటి ఎన్నిక ఎక్కడా నిర్వహించలేదని మండిపడ్డారు. ఎన్నికల సంఘం, పోలీసు శాఖ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడంలో విఫలమయ్యాయన్నారు. అభ్యర్థి కూడా ఓటు వేసుకోకపోవడం ఇప్పటి వరకు ఎక్కడా జరగలేదన్నారు. ఏజెంట్లను బూత్లలోకి రానివ్వకుండా జరిగిన ఏకై క ఎన్నికలు ఇవేనన్నారు. ఇతర నియోజకవర్గం నుంచి మనుషులు వచ్చి బూత్లు ఉన్న గ్రామాలలో షామియానాలు వేసుకొని జాతరను తలపించేలా చేస్తూ.. ఓటర్లను ఓటు వేసేందుకు పోనివ్వకుండా అడ్డుపడ్డారంటే వారికి పోలీసులు ఎంత సహకరించారో ఇట్టే అర్థం అవుతుందన్నారు. ‘మా ఓటు మమ్మల్ని వేసుకోనివ్వండి’ అని మహిళా ఓటర్లు ప్రాధేయపడ్డా, కాళ్లు పట్టకుంటామని వేడుకున్నా.. వారిని ఓటు వేసుకోనివ్వలేదంటే ఈ కూటమి ప్రభుత్వంలో స్వాతంత్య్రం ఉన్నాట్టా.. లేనట్టా అని నిలదీశారు. డీఐజీ తన స్థాయి మరచి హెడ్ కానిస్టేబుల్ లాగా ప్రవర్తించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇంతకంటే దుర్మార్గమైన చర్య ఉందా అని నిలదీశారు. బీహార్ వంటి రాష్ట్రాలలో ఉన్న సంస్కృతిని మన రాష్ట్రంలో కొనసాగించటం దుర్మార్గపుచర్య అని మండిపడ్డారు. ఈ ఎన్నికపై అన్ని ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే, వారికి చీమ కుట్టినట్టు కూడా అనిపించకపోవటం ప్రజాస్వామ్యమేనా అని ఎద్దేవా చేశారు.
జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి నాయకుల దుశ్చర్యలపై మండిపాటు
ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి