
ఎంపీ మిథున్రెడ్డి విడుదల కోసం పెద్దదర్గాలో ప్రార్థనలు
కడప సెవెన్రోడ్స్ : రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి త్వరగా విడుదల కావాలని ఆకాంక్షిస్తూ వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ ప్రతినిధులు బుధవారం పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తొలుత వారు దర్గాలోని ప్రధాన గురువులు హజరత్ పీరుల్లాసాహెబ్ మాలిక్ మజార్ను దర్శించుకుని ఫాతెహా చేశారు. అనంతరం దర్గాలోని ఇతర గురువుల మజార్లను కూడా దర్శించుకుని ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ మాట్లాడుతూ మృదు స్వభావి, ప్రజా నాయకుడు, సామాన్య కార్యకర్తను కూడా ఎంతో అభిమానంతో పలకరించే మిథున్రెడ్డిని రాజకీయ కక్షతోనే అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఎన్ఆర్ఐలతోపాటు వారి కుటుంబ సభ్యులకు తమవంతుగా తోడ్పాటు అందించిన పెద్దిరెడ్డి మిథున్రెడ్డి బెయిలుపై విడుదల కావాలని దర్గా గురువులను ప్రార్థించామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కువైట్ కమిటీ సభ్యులు షేక్ గఫార్, ఎన్.సుబ్బారెడ్డి, సి.అమర్నాథ్ రెడ్డి, రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి అలీ అక్బర్, ప్రధాన అధికార ప్రతినిధి షేక్ గౌస్ బాషా (చాక్లెట్) కార్పొరేటర్లు షేక్ షంషీర్, షేక్ జిలాన్ (డిష్ జిలాన్), జి. ప్రవీణ్, కుమార్రెడ్డి, షేక్ గయాజ్, బాబుభాయి, నాసర్, రాజాసాబ్, పీర్బాషా, ఫారూఖ్, అహ్మద్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగుల న్యాయమైన సమస్యలను సత్వరమే పరిష్కరించేలా ప్రభుత్వం, యాజమాన్యం తగిన చర్యలు చేపట్టాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ రెండవ రోజు బుధవారం అసోసియేషన్ నాయకులు కడప ఆర్టీసీ బస్టాండులోని ప్రధాన ద్వారం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించి తక్షణమే పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేయాలని, వేతన సవరణ జరిగి ఇప్పటికే రెండు సంవత్సరాలు పూర్తయినందున వెంటనే ఐఆర్ ప్రకటించాలని, గవర్నర్పేట–2 డిపోకు చెందిన 4.15 ఎకరాల స్థలాన్ని లులూ సంస్థకు బదలాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీఓను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. 8 వేల ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని, గత నాలుగేళ్లుగా నిలిచిపోయిన పదోన్నతులు వెంటనే ఇవ్వాలని, నాన్ ఆపరేషన్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగుల అనారోగ్య సెలవులకు పూర్తి జీతం చెల్లించాలని, ఈహెచ్ఎస్ స్థానంలో పాత వైద్య విధానాన్ని పునరుద్దరించాలని, గ్యారేజీ ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను పరిష్కరించడంతోపాటు మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీఓ ప్రకారం పిల్లల సంరక్షణ సెలవులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రీజినల్ ప్రెసిడెంట్ నాగముని, డిపో ప్రెసిడెంట్ జయరాం, గ్యారేజ్ సెక్రటరీ మల్లేష్, డిపో జాయింట్ సెక్రటరీ లక్ష్మయ్య, సీఎస్ రెడ్డి, రాఘవ తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ మిథున్రెడ్డి విడుదల కోసం పెద్దదర్గాలో ప్రార్థనలు