భర్త ఇంటి ముందు బైఠాయింపు | - | Sakshi
Sakshi News home page

భర్త ఇంటి ముందు బైఠాయింపు

Jun 27 2025 11:18 AM | Updated on Jun 27 2025 11:19 AM

నందలూరు: తన భర్తతో తనను కలిపి న్యాయం చేయాలంటూ ఓ మహిళ అత్తగారి ఇంటి ముందు తండ్రితో కలిసి బైఠాయించిన సంఘటన నందలూరులో చోటు చేసుకుంది. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని అరవపల్లికి చెందిన హనుమంతు మురళి, శ్రీలక్ష్మీ కుమారుడు దేవేంద్రప్రసాద్‌కు వేంపల్లెకు చెందిన యనమల వెంకటనారాయణ, లక్ష్మీదేవిల కుమార్తె శారదతో 2014లో వివాహమైంది. నాలుగు సంవత్సరాల పాటు సంసారం సజావుగా సాగింది. 2018లో అత్తా కోడళ్ల మధ్య మనస్పర్ధలు రావడంతో తన పుట్టింటికి శారద వెళ్లింది. 

ఇదే అదునుగా భావించిన ప్రసాద్‌ కోర్టును ఆశ్రయించి తన భార్య ఆరోగ్యం సరిగా లేదంటూ కోర్టును పెడదోవ పట్టించి 2021లో విడాకులు తీసుకున్నాడు. విషయం తెలుసుకున్న శారద పోలీసులకు ఫిర్యాదు చేసి రాజంపేట కోర్టును ఆశ్రయించడంతో జులై 2024లో విడాకులను రద్దు చేసింది. అప్పటి నుంచి తన భర్తను కలవాలని ప్రయత్నిస్తుంటే ఈ రోజు, రేపు, మాపు అంటూ సంవత్సరం నుంచి కాలం గడిపి తనను అత్తగారింటికి రానివ్వలేదని వాపోయారు. తిరిగి తాము గురువారం పోలీసులను ఆశ్రయించామన్నారు. వారు తన భర్తకు ఫోన్‌ చేయగా వెంటనే సెల్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసుకుని ఇంటికి తాళాలు వేసుకుని పరారయ్యారని తెలిపారు. పెద్దలు, పోలీసులు తనను తన భర్తతో కలిపి తన సంసారాన్ని నిలబెట్టాలని బాధితురాలు వేడుకుంటోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement