
బైకులు ఎదురెదురుగా ఢీకొని యువకుడి దుర్మరణం
మదనపల్లె రూరల్ : బైకులు ఎదురెదురుగా ఢీకొని ఓ యువకుడు దుర్మరణం చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం మదనపల్లె మండలంలో జరిగింది. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు.. బి.కొత్తకోట మండలం గట్టు పంచాయతీ పట్రవారి పల్లెకు చెందిన కృష్ణమూర్తి, ఈశ్వరమ్మ దంపతుల కుమారుడు హరీష్ (24), తన బంధువు, వృత్తిరీత్యా డ్రైవర్ అయిన బాబు మోహన్(25)తో కలసి స్కూటీలో వ్యక్తిగత పనులపై పుంగనూరుకు వెళ్లారు. అక్కడి నుంచి బాబు మోహన్ టాటా ఏస్ వాహనం తీసుకుని బయలు దేరాడు. హరీష్ స్కూటీ వాహనంలో స్వగ్రామానికి బయలుదేరి వస్తుండగా, మదనపల్లె సమీపంలోని వలసపల్లి పంచాయతీ జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద, పట్టణంలోని రామారావు కాలనీకి చెందిన బైక్ మెకానిక్ స్వామినాథ్ (28) మద్యం మత్తులో, మరో ఇద్దరితో కలిసి ద్విచక్ర వాహనంలో వేగంగా వెళ్లి స్కూటీని ఢీకొన్నాడు. ప్రమాదంలో స్కూటీ నడుపుతున్న హరీష్ ఎగిరి దూరంగా పడటంతో తలకు తీవ్ర గాయమై, చెవులు, ముక్కులలో అధిక రక్తస్రావం జరిగి అపస్మారక స్థితికి వెళ్లాడు. వెనుకనే టాటా ఏస్ వాహనంలో వస్తున్న బాబు మోహన్ గుర్తించి అదే వాహనంలో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించాడు. పరీక్షించిన ఆసుపత్రి అత్యవసర విభాగం వైద్యులు హరీష్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. స్వామినాథ్ కూడా తీవ్రంగా గాయపడటంతో చికిత్స అందించారు. హరీష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీ గదికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
మృతుడు పట్రావారిపల్లె వాసి
మరో యువకుడికి తీవ్ర గాయాలు

బైకులు ఎదురెదురుగా ఢీకొని యువకుడి దుర్మరణం