
మదనపల్లెలో కాల్ మనీ కీచకులు
మదనపల్లె రూరల్ : సరిగ్గా ఏడేళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వంలో విజయవాడలో వెలుగు చూసిన కాల్ మనీ వ్యవహారం మళ్లీ పడగ విప్పుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కాల్ మనీ విష సంస్కతి విస్తరిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలు, అరాచకాలు, అకృత్యాలు పెరిగిపోతున్నాయి. నిన్నటికి నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గం కుప్పంలో అప్పు కట్టలేదని మహిళను చెట్టుకు కట్టేసి అమానుషంగా శిక్షించిన ఘటన మరువక ముందే.. మదనపల్లిలో వడ్డీ కోసం వ్యభిచారం చేయమని ఒత్తిడి తెచ్చేంతగా రాక్షసులు బరి తెగించారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ కేంద్రంగా కాల్ మనీ సెక్స్ రాకెట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. సరిగ్గా అలాంటిదే మదనపల్లెలో జరుగుతున్న వ్యవహారంపై సాక్షి వెలుగులోకి తెచ్చిన కథనం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాధిత మహిళ గౌరీకి మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మద్దతుగా నిలిచారు. మదనపల్లె కాల్ మనీ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. కుప్పంలో అప్పు తీర్చలేదని ఓ మహిళను చెట్టుకు కట్టేసి హింసించిన ఘటనలో తక్షణమే స్పందించిన సీఎం చంద్రబాబు, మదనపల్లెలో రజక సామాజిక వర్గానికి చెందిన చెందిన బీసీ మహిళ, మరికొందరు బడుగు జీవులపై జరుగుతున్న అన్యాయాలపై కనీస స్పందన లేకపోవడంపై విమర్శలను సంధిస్తున్నారు.
పేద, మధ్యతరగతి ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి ముక్కు పిండి మరీ వసూలు చేస్తూ దౌర్జన్యాలకు పాల్పడే ముఠాలు మదనపల్లెలో అధికమయ్యాయి. డైలీ, వీక్లీ, మంత్లీ.. పేరుతో వందకు పది రూపాయల నుంచి 45 రూపాయల వరకు, ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు ష్యూరిటీగా ఉంచుకొని ఎడాపెడా రుణాలను ఇచ్చేస్తున్నారు. అప్పు తీసుకున్న మహిళలు సకాలంలో చెల్లించకపోయినా, కాస్త ఆలస్యం చేసినా ఇళ్ల వద్దకు వెళ్లి వారిని దుర్భాషలాడటం, లైంగికంగా వేధింపులకు గురి చేయడం సర్వసాధారణమైపోయింది. కాల్ మనీ పేరిట మహిళలను వేధించిన వారికి ఉన్న పలుకుబడులు బాధితులకు న్యాయం జరగనీయకుండా చేస్తున్నాయి. మదనపల్లెలో నీరుగట్టువారిపల్లె, రామారావు కాలనీ, అనప గుట్ట, కురవంక, వీవర్స్ కాలనీ, బసినికొండ, ప్రశాంత్ నగర్ తదితర ప్రాంతాల్లో ముఖ్యంగా చేనేత కార్మికులు నివసించే చోట వడ్డీ వ్యాపారం విస్తృతంగా కొనసాగుతోంది. వడ్డీ రాక్షసుల ఆగడాలపై బాధిత మహిళలు బుధవారం సాక్షితో మాట్లాడారు. తమ పేర్లు వెల్లడించవద్దని కోరుతూ తాము ఎదుర్కొన్న వేధింపులను ఏకరువు పెట్టారు. అప్పులు తీర్చమని తమపై ఒత్తిడి తెస్తూ వడ్డీ వ్యాపారులు మానసికంగా శారీరకంగా తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. వాటిని భరించలేక పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టేందుకు ప్రయత్నిస్తే, మధ్యవర్తుల ద్వారా రాజీమార్గాలను ఎంచుకొని, తరువాత తమ వద్ద నుంచి తీసుకున్న ఖాళీ బ్యాంకు చెక్కులతో కోర్టులో కేసులు వేసి వేధిస్తున్నారని తెలిపారు. రుణాల చెల్లింపు కోసం తమ వద్ద ఆస్తులను రాయించుకుని వేధిస్తున్నారన్నారు. వీరి బాధల నుంచి బయటపడేందుకు జిల్లా స్థాయి పోలీస్ అధికారులను, తాము సంప్రదించాలని భావిస్తున్న విషయాన్ని ముందే పసిగట్టి, తమకంటే ముందే జిల్లా పోలీస్ కార్యాలయానికి వెళ్లి తమపై ఫిర్యాదు చేసి సోషల్ మీడియాలో తమను దోషులుగా చిత్రీకరించి, వారి వేధింపులను ఆగడాలను కనుమరుగయ్యేలా చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. స్థానిక పోలీసులకు వారి ఆగడాలపై ఫిర్యాదులు చేస్తే పట్టించుకోకుండా వడ్డీ రాక్షసులకే వత్తాసు పలుకుతున్నారనే విమర్శలున్నాయి. అప్పు తీసుకున్న పాపానికి వడ్డీలకు వడ్డీ చెల్లించినా, తమకు రుణ బాధల నుంచి విముక్తి కలగలేదని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి వడ్డీ వ్యాపారుల కోరల నుంచి తమను రక్షించాలని బాధితులు కోరుతున్నారు. మనిషి ఆర్థిక అవసరాలను అవకాశంగా తీసుకొని వ్యాపారులు దోచుకుంటున్నా, అధిక వడ్డీలు, అక్రమ వసూళ్ల పేరుతో అమాయకులను బలిచేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని, వసూళ్ల పేరుతో మహిళలను బెదిరించి, వేధిస్తే క్రిమినల్ కేసులు పెడతామని.. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే వారే టార్గెట్గా జరిగే వడ్డీ వ్యాపారాలను కూటమి సర్కార్ సీరియస్గా తీసుకుంటుందని హెచ్చరించిన హోం మంత్రి అనిత... మదనపల్లె ఘటనపై చర్యలు తీసుకోకవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
కూటమి ప్రభుత్వంలో మహిళలపై
పెరుగుతున్న అఘాయిత్యాలు
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం
సృష్టించిన సాక్షి కథనం
బాధితురాలు గౌరీకి మహిళా సంఘాల మద్దతు
వడ్డీ రాకాసురులపై గళం విప్పిన బాధిత మహిళలు

మదనపల్లెలో కాల్ మనీ కీచకులు