
మున్సిపల్ వైస్ చైర్మన్, మహిళా కౌన్సిలర్, మరో 16 మంద
రాయచోటి : రాయచోటి మున్సిపల్ వైస్ చైర్మన్ పి.దశరథరామిరెడ్డి, 15వ వార్డు కౌన్సిలర్ పి.విజయమ్మతోపాటు మరో 16 మందిపై రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇరిగేషన్ రిటైర్డ్ డీఈ మండెం ఆదినారాయణ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అర్బన్ సీఐ బి.వి. చలపతి తెలిపారు. రాయచోటి పట్టణ పరిధిలోని 553 సర్వే నంబరులో భూ తగదా విషయంపై దశరథరామిరెడ్డి తన అనుచరులతో కలిసి మే 22వ తేదీన దాడికి ప్రయత్నించినట్లు ఫిర్యాదు అందిందన్నారు. అప్పటి నుంచి రాజీకి ప్రయత్నించగా కుదరకపోతే కేసు నమోదు చేశారు. అయితే అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకే తమపైన కేసు నమోదు చేశారని మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథరామిరెడ్డి మీడియాకు తెలిపారు.
రైతుపై ఆర్టీసీ కార్గో సిబ్బంది దాడి
రాయచోటి : మామిడి పండ్ల ప్యాకెట్లను పార్సల్ చేయడానికి వెళ్లిన రైతుపై ఆర్టీసీ కార్గో సిబ్బంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన చోటు చేసుకుంది. రాయచోటి పట్టణం కొత్తపేటలో నివాసం ఉంటున్న రైతు బాబు రెడ్డి (30) తోటలో పండించిన మామిడికాయలను బంధువులకు పంపించేందుకు రెండు ప్యాకెట్లను తీసుకొని రాయచోటి ఆర్టీసీ బస్టాండ్లో గల పార్సెల్ సర్వీస్ సెంటర్కు వెళ్లారు. రైతు తెచ్చిన ప్యాకెట్లు చిన్నవిగా ఉండటంతో రెండు కలిపి ఒకటిగా పంపుకోవచ్చని అక్కడున్న ఆర్టీసీ సిబ్బంది బాబు రెడ్డికి సూచించారు. రెండిటిని కలిపి ఒకే ప్యాకేజీలో పార్సల్ చేయాలని కొరియర్ సిబ్బందికి సూచించారు. పార్సెల్ సర్వీస్ లో పనిచేస్తున్న అంజి నాయక్, సాయి అనే యువకులు ఆ మామిడి పండ్లు రెండు పార్సెల్ ఒకటిగా పంపించడం కుదరదని నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో పాటు పార్సెల్ పంపేందుకు వచ్చిన రైతు పై దాడికి దిగారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం పెరిగి ఘర్షణకు దారి తీసింది. పార్సెల్ సర్వీస్ లో పనిచేసే అంజి నాయక్, సాయి లు ఇద్దరు కలిసి వేయింగ్ మిషన్ తో బాబు రెడ్డి తలపై బలంగా కొట్టడంతో పాటు తీవ్రంగా గాయపరిచారు. దాడిలో బాబు రెడ్డి తీవ్రంగా గాయపడమే కాకుండా అతని జేబులో ఉన్న 50 వేలు నగదు కూడా గల్లంతయిందని బాధితుడు వాపోయాడు. తీవ్రంగా గాయపడిన బాబు రెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మామిడి పండ్లు పార్సల్ పంపేందుకు వెళ్లిన రైతు బాబురెడ్డిపై దాడి చేసిన ఆర్టీసీ కార్గో సిబ్బందిని కఠినంగా శిక్షించాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగిమళ్ల రంగారెడ్డి డిమాండ్ చేశారు.
గంజాయి విక్రయిస్తున్న
వ్యక్తి అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం : పట్టణ శివారు ప్రాంతంలోని రైల్వేస్టేషన్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని ప్రొద్దుటూరు ఎకై ్సజ్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం రావడంతో ప్రొద్దుటూరు ఎకై ్సజ్ సీఐ సురేంద్రారెడ్డి సిబ్బందితో కలిసి గురువారం దాడులు నిర్వహించారు. దాడిలో సీకే దిన్నె మండలంలోని మామిళ్లపల్లె గ్రామానికి చెందిన బి.రామాంజనేయులు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 1.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇతను స్థానికంగా ఉన్న పలు కళాశాలల విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని గంజాయి విక్రయిస్తున్నట్లు సీఐ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించామన్నారు.