
సాక్షి, రాజంపేట ప్రతినిధి: తనది కాని విలువైన వస్తువును భరించలేని ఓ వ్యక్తి.. చివరకు దానిని దేవుడి హుండీలో వేసి బరువు దించుకున్నాడు. రాజంపేట పట్టణంలో ప్రసిద్ధిగాంచిన ఆంజనేయ స్వామి ఆలయంలోని హుండీలో ఓ అజ్ఞాత భక్తుడు ముడి వజ్రాన్ని (డైమండ్) వేసినట్లు రాజంపేట సమూహ దేవస్థానాల ఈఓ కొండారెడ్డి తెలిపారు.
హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కిస్తున్న సమయంలో 1.39.6 క్యారెట్ల వజ్రం ఉన్నట్లు ఈవో తెలిపారు. భక్తుడు వజ్రం టెస్టింగ్ కార్డుతో పాటు ఓ లేఖను కూడా వేశారన్నారు. డైమండ్ తనకు దొరికిందని, దీనిని అమ్మలేక.. భరించలేక.. వస్తువుగా తయారు చేసి ఇచ్చే శక్తిలేక హుండీలో వేసినట్లు, దీనిని ఉపయోగపడేలా చూడాలని ఆశిస్తున్నట్లు ఆ లేఖలో రాసాడని ఈఓ చెప్పారు.
హుండీ ఆదయాన్ని లెక్కించగా నగదు రూపంలో 79,119 రూపాయిలు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ జనార్దన్, జూనియర్ అసిస్టెంట్ లక్ష్మయ్య, ఆలయ ప్రధాన అర్చకులు రవిస్వామి, ఆలయ కమిటీ మాజీ అధ్యక్షుడు పబ్బిశెట్టి సుబ్రమణ్యం, కమిటి ప్రతినిధులు పాల్గొన్నారు.