
యోగా ఔన్నత్యాన్ని నలుదిశలా చాటుదాం
బి.కొత్తకోట/కురబలకోట: యోగా ఔన్నత్యాన్ని నలుదిశలా చాటాలని, అందరికీ ఆరోగ్యం యోగా లక్ష్యం కావాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. గురువారం ఆంధ్రా ఊటీ హార్సిలీహిల్స్లో పర్యాటక శాఖ, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ఆదర్శ్రాజేంద్రన్, మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్తో కలసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వళన చేశారు. ఈ సంద్ఛంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎత్తయిన ప్రదేశం హార్సిలీహిల్స్లో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం ఆహ్లాదంగా ఉందన్నారు. ప్రపంచానికి మన దేశం అందించిన గొప్ప వరం యోగా అన్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఇది భాగం కావాలన్నారు. ప్రతి రోజు కొంత సమయం కేటాయించి యోగాసనాలు చేస్తే రుగ్మతలు దూరం అవుతాయని, మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని జిల్లాలో తొలుత మదనపల్లెలో తర్వాత హార్సిలీహిల్స్లో జరపడం సంతోషంగా ఉందన్నారు. ఈనెల 21న రాయ చోటిలో ఐదు వేల మందితో నిర్వహించడంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని హ్యాబిటేషన్లు, గ్రామాల్లో జరపబోతున్నట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వైజాగ్లో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే యోగాంధ్ర కార్యక్రమం ప్రపంచ రికార్డు సృష్టించనుందన్నారు. అంతకుముందు వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్య క్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం మదనపల్లెకు చెందిన అంతర్జాతీయ యోగా మాస్టర్ పాల్ బ్రహ్మ కుమార్ ఆధ్వర్యంలో యోగాసనాలు నిర్వహించారు. జిల్లా పర్యాటక అధికారి నాగభూషణం, డీఆర్డీఏ పీడీ సత్యనారాయణ, ఏడీ సర్వేయర్ భరత్కుమార్, తహశీల్దారు బావాజాన్, ఎంపీడీఓ కృష్ణవేణి, ఎంఈఓ రెడ్డి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్
హార్సిలీహిల్స్లో ఘనంగా యోగాంధ్ర కార్యక్రమం

యోగా ఔన్నత్యాన్ని నలుదిశలా చాటుదాం