
సాక్షి, కురుపాం: వైఎస్ జగన్ కేజీహెచ్కు వెళ్లడాన్ని కూడా రాజకీయం చేస్తే ఎలా అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. మంచి నీరు కలుషితం అయ్యాయి కాబట్టి పచ్చ కామెర్లు వచ్చాయని చెప్పుకోవడం కూటమి ప్రభుత్వానికి సిగ్గు చేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల విషయంలో విద్యాశాఖ మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
పచ్చకామెర్ల మృతుల కుటుంబాలకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం అందించింది. పచ్చ కామెర్లతో మృతిచెందిన విద్యార్థులు కల్పన, అంజలి.. రెండు కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం అందజేసింది. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు.
ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మానవత్వంతో పచ్చ కామెర్లతో మృతి చెందిన కల్పన, అంజలి కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున సాయం అందించారు. గిరిజన విద్యార్థులకు ధైర్యం చెప్పడానికే వైఎస్ జగన్ కేజీహెచ్కు వెళ్లారు. దాన్ని కూడా రాజకీయం చేస్తారా?. ఆసుపత్రిలో ఉండి కూడా చిన్నారులు చనిపోతున్నారు. విద్యార్థులకు అండగా ఉండటం ప్రభుత్వ బాధ్యత కాదా?. ఇంత బలహీనమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. మంచి నీరు కలుషితం అయ్యాయి కాబట్టి పచ్చ కామెర్లు వచ్చాయని చెప్పుకోవడం ప్రభుత్వానికి సిగ్గు చేటు.
జిల్లా మంత్రులు, అధికార్లు ఏం చేస్తున్నారు. మీ ఇంట్లో పిల్లలకు అనారోగ్యం వస్తే ఇలాగే వ్యవహరిస్తారా?. విద్యాశాఖ మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు. అందరు హాస్టల్ విద్యార్థులకు స్క్రీనింగ్ చేసి, వ్యాధి నిర్ధారణ చేయాలి. స్వతంత్రం వచ్చాక ఇంత బాధ్యతా రాహిత్యంగా ఏ ప్రభుత్వం లేదు. పేదలకు అందుబాటులో వైద్యం అందించాలి అనే వైఎస్ జగన్ ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడవద్దు’ అంటూ హితవు పలికారు.
