తాడేపల్లి: కృష్ణా జలాల పరిరక్షణలో వైఫల్యంపై చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎండగట్టారు. ఈ మేరకు వైఎస్ జగన్..చంద్రబాబుకు లేఖ తొమ్మిది పేజీల లేఖ రాశారు.
ఆ లేఖలో వైఎస్ జగన్ ఏమన్నారంటే?.. ‘ట్రిబ్యునల్లో రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపించాలి. KWDT–2 ఎదుట జరగబోయే వాదనల్లో రాష్ట్ర ప్రయోజనాలను సమర్థవంతంగా వినిపించాలి. పొరపాటు జరిగితే ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదిలో 763 టీఎంసీలను కేటాయించేందుకు ట్రిబ్యునల్ అంగీకరిస్తే ఏపీకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వం తమ వాదనలు వినిపించాలి
రాయలసీమ ప్రాజెక్టులపై టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 1996లో చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అల్మట్టి ప్రాజెక్టు ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచే పనులు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు, రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆల్మట్టి ఎత్తు పెంపు వలన ఏపీ హక్కులకు ముప్పు ఏర్పడుతుంది. దీనిపై అప్పట్లో ఎన్ని ఆందోళనలు చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు.
ప్రజాభిప్రాయాన్ని రైతుల ఆందోళనలను ఖాతరు చేయలేదు. టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆల్మట్టి ఎత్తు పెంపునకు అనుమతి ఇచ్చింది. అంతేకాదు.. 2014లో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం కృష్ణా నదిపై ఏపీ హక్కులను తెలంగాణకు పూర్తిగా వదిలేసింది.

ఇప్పుడు మళ్లీ చంద్రబాబు సీఎంగా ఉన్న తరుణంలోనే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్లిష్ట పరిస్థితిలో టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర హక్కులను సమర్థంగా కాపాడాలి. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 512 టీఎంసీల నికర నీటిలో ఒక్క టీఎంసీ తగ్గినా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. దీనికి చంద్రబాబు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి’ అని సూచించారు.


