
విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి
మాజీ సీఎం వైఎస్ జగన్ హితవు
కూటమి పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది
పాలనను గాలికొదిలేసి ప్రతిపక్షపార్టీపై బురదజల్లుతున్నారు
కలుషితాహారంతో విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నా ప్రభుత్వం స్పందించడంలేదు
గోరుముద్ద పథకాన్ని ఘోరమైన కార్యక్రమంగా మార్చేశారు
సాక్షి, అమరావతి: గుడ్లవల్లేరు ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో రహస్య కెమెరాలు పెట్టినట్టుగా వస్తున్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, విద్యార్థుల జీవితాలను అతలాకుతలంచేసే ఘటన ఇది అని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబూ ఇకనైనా మేలుకోండి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి, వారి భవిష్యత్తును పణంగా పెట్టకండి అని హితవు పలికారు.
‘చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన మూ నెలల్లో విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వ విద్యాసంస్థలపై నిర్లిప్తత, కాలేజీలపై పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రతిపక్షపార్టీపై బురదజల్లుడు వ్యవహారాలు, రెడ్బుక్ రాజ్యాంగం అమల్లో ప్రభుత్వ పెద్దలు, యంత్రాంగం అంతా మునిగిపోయి పాలనను గాలికొదిలేశారు.
నూజివీడు ట్రిపుల్ ఐటీ సహా గవర్నమెంటు రెసిడెన్షియల్ స్కూళ్లలో కలుషితాహారం కారణంగా వందల మంది విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నా, వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా, ప్రభుత్వం స్పందన అత్యంత దారుణంగా ఉంది. ముఖ్యమంత్రి కొడుకే విద్యాశాఖ మంత్రి కావడంతో అసలు ఏమీ జరగలేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
పిల్లలకు నాణ్యతతో, రోజూ ఒక మెనూతో పెట్టే మధ్యాహ్న భోజనం, గోరుముద్ద పథకాన్నీ అత్యంత ఘోరమైన కార్యక్రమంగా మార్చేశారు’ అంటూ శుక్రవారం వైఎస్ జగన్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు.
