హోరెత్తిన ‘యువత పోరు’ | Youth, Students Fires On Chandrababu Naidu Government | Sakshi
Sakshi News home page

హోరెత్తిన ‘యువత పోరు’

Jun 24 2025 4:58 AM | Updated on Jun 24 2025 4:58 AM

Youth, Students Fires On Chandrababu Naidu Government

ఏలూరు కలెక్టరేట్‌ వద్ద యువతను అడ్డుకుంటున్న పోలీసులు

సాక్షి, అమరావతి: ఉద్యోగాల భర్తీ అంటూ ఉత్తుత్తి హామీతో... నిరుద్యోగ భృతి పేరిట నయవంచనకు పాల్పడిన కూటమి ప్రభుత్వంపై యువత, విద్యార్థులు కన్నెర్రజేశారు. అరొకరగా నిధులు విడుదల చేస్తూ.. విద్యా దీవెన, వసతి దీవెనపై కపట ప్రేమ చూపుతున్న సర్కారు తీరును ఎండగట్టారు. 

చంద్ర­బాబు ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని నిలదీశారు. మాట తప్పి... వెన్ను­పోటు పొడిచిన ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల వద్ద ఆందోళనలు చేప­ట్టారు. పోలీసుల అణచివేత చర్యలను ఎదుర్కొంటూ ముందుకు కదిలారు. 

కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలు ఏడాదైనా నెరవేర్చలేదని నిప్పులు చెరిగారు. అధికారంలోకి వస్తే ఉద్యోగాలు భర్తీ చేస్తామని, అప్పటివరకు యువతకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి అంటూ కూటమి పార్టీలు ఇచ్చిన హామీ ప్రచారానికే పరిమితమైంది. 

విద్యా దీవెన కింద రూ.4,200 కోట్లు, వసతి దీవెన కింద రూ.2,200 కోట్లు... మొత్తం రూ.6,400 కోట్లకు గాను, రూ.750 కోట్లు విదిలించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో విద్యా దీవెన, వసతి దీవెనలను క్రమంతప్పకుండా ఠంఛనుగా అందించి పిల్లల చదువులకు అండగా నిలిచింది. 

2024 జనవరి వరకు నిధులను క్లియర్‌ చేసింది. జనవరి నుంచి మార్చి వరకు త్రైమాసికం బిల్లులు ఏప్రిల్‌లో ప్రాసెస్‌ చేసి మేలో విడుదల చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్‌ కారణంగా నిలిచిపోయాయి. అప్పటినుంచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆరు క్వార్టర్లు బకాయి పడింది. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్‌సీపీ సోమవారం ‘యువత పోరు’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఆ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు, నిరుద్యోగులు కదంతొక్కారు. 

పల్నాడు జిల్లా నరసరావుపేటలో లాఠీలతో విరుచుకుపడుతున్న పోలీసులు  

వంద­లాది మంది ప్లకార్డులు చేతబట్టి ‘బాబు వచ్చాడు... వాలంటీర్లను రోడ్డుపై నిలబెట్టాడు, ఏడాదిలో 4 లక్షల ఉద్యోగాలు తొలగించాడు.. నిరుద్యోగ భృతి ఎప్పుడు?.. గ్రూప్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇంకెప్పుడు... ప్రతి నిరుద్యోగికి రూ.36 వేలు నిరుద్యోగ భృతి తక్షణమే ఇవ్వాలి.. ఫీజులు చెల్లించక విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం... వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలి, జాబ్‌ క్యాలెండర్‌ వెంటనే ప్రకటించాలి’ అని నినదించారు. 

20లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారని మండిపడ్డారు. వలంటీర్లను రోడ్డున పడేయడంతో పాటు ఇంటింటికి నిత్యావసర సరకులు అందిస్తున్న రేషన్‌ వాహనాలను నిలిపివేసి ఆపరేటర్ల జీవనోపాధిపై దెబ్బకొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. 

కూటమి ప్రభుత్వం హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టర్లకు యువతీ, యువకులతో కలిసి వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నేతలు వినతిపత్రాలు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు, పెద్ద ఎత్తున తరలివచ్చిన యువతతో కార్యక్రమం విజయవంతమైంది. 

కాకినాడలో ‘యువత పోరు’ ర్యాలీలో కదం తొక్కిన యువత, విద్యార్థులు  
 
విజయవాడ ధర్నాచౌక్‌లో పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రవిచంద్ర ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువత పోరు చేపట్టారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్‌మోహన్‌రావు, జగ్గయ్యపేట ఇన్‌చార్జి తన్నీరు నాగేశ్వరరావు, ఇతర అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

⇒ కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కలెక్టరేట్‌ సమీపంలో ఉన్న ధర్నాచౌక్‌ వద్ద వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మేరుగుమాల శ్రీకాళేశ్వరరావు (కాళీ) అధ్యక్షతన జరిగిన యువత పోరులో మచిలీపట్నం నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), సింహాద్రి వికాస్, పలువురు అనుబంధ విభాగాల నాయకులు ప్రసంగించారు.

ఆంక్షల నడుమ..
⇒ ప్రకాశం జిల్లాలో యువత పోరుపై అడుగడుగునా పోలీసులు అంక్షలు విధించారు. కలెక్టరేట్‌ వద్ద ఉదయం నుంచే భారీగా బలగాలను దించారు. అంబేడ్కర్‌ భవనానికి వెళ్లే దారిలో బారికేడ్లు ఏర్పాటు చేసి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్త­లతో పాటు సామాన్య ప్రజలూ రాకపోకలు సాగించకుండా కట్టడి చేశారు. 

అయినా జిల్లావ్యాప్తంగా విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అంబేడ్కర్‌ భవనం వద్ద జరి­గిన సభలో యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ మా­ట్లా­డుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాదైనా హామీ­లు అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.

ఒంగోలు కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొన్న నిరుద్యోగులు, విద్యార్థులు 

⇒ రాష్ట్రంలో బెదిరింపులు, భయపెట్టడం, అక్రమ కేసులు, నెలల తరబడి జైళ్లలో ఉంచేలా కక్షసాధింపు రాజకీయాలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ధ్వజమెత్తారు. ఏలూరులో యువత పోరులో పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాతో కలిసి ఆయన పాల్గొన్నారు.  ఫైర్‌ స్టేషన్‌ సెంటర్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్‌ వద్ద రోడ్డుపై బైఠాయించారు. 

రిక్షా తొక్కుతూ..
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో యువతీ, యువకులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతను మోసం చేసిన కూటమి ప్రభుత్వం తీరుపై రిక్షా తొక్కుతూ పరిస్థితిని చాటి చెప్పారు. కలెక్టరేట్‌ వరకు ప్రభుత్వ తీరుపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ తీశారు. 

‘తూర్పు’న కదం తొక్కిన యువత
రాజమహేంద్రవరంలో కలెక్టరేట్‌కు వెళ్తున్న యువత పోరు భారీ ర్యాలీని బొమ్మూరు సెంటర్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారికి, యువజన సంఘం నేతల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం కలెక్టరేట్‌ వద్ద బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

అమలాపురంలో పోలీసులను దాటి మరీ
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో వైఎస్సార్‌సీపీ యువత పోరుకు తొలుత అనుమతి ఇచ్చిన పోలీసులు ఆదివారం అర్ధరాత్రి  అనుమతి లేదని చెప్పారు. కలెక్టరేట్‌కు బయలుదేరిన ఆందోళనకారులను పోలీసులు మూడుసార్లు అడ్డుకున్నారు. కలెక్టరేట్‌ సమీపాన బారికేడ్లు, రోప్‌ పార్టీలతో నిలువరించారు. మహిళా నేతలు, కార్య­కర్తలను సైతం పోలీసులు వెనక్కు నెట్టేశారు. ఆగ్రహించిన కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులను నెట్టుకుని ముందుకు వచ్చారు. 

నంద్యాల కలెక్టరేట్‌ వద్ద ఆందోళనకు భారీగా తరలివచ్చిన యువత 

⇒ కాకినాడ సిటీ వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి డీఎంహెచ్‌ఓ కార్యాలయం, జెడ్పీ సెంటర్, ఆర్‌డీఓ కార్యాలయం మీదుగా కలెక్టరేట్‌ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. యువకులు, విద్యార్థులు మూకుమ్మడిగా కలెక్టరేట్‌కు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. 

⇒ వైఎస్సార్‌ కడప జిల్లా కేంద్రం కడపలో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి  జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కోటిరెడ్డి సర్కిల్, సంధ్యా సర్కిల్, ఎర్రముక్కపల్లె, మహావీర్‌ సర్కిల్‌ మీదుగా కలెక్టరేట్‌ వరకూ చేరింది. అనంతరం డీఆర్‌ఓ విశ్వేశ్వర నాయుడుకు వినతి పత్రం సమర్పించారు.  

⇒ నంద్యాలలో యువత పోరుకు నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం, డోన్, శ్రీశైలం, నందికొట్కూరు నియోజ­కవర్గాల నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. 

⇒ తిరుపతిలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం తిరుపతి జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌వంశీ, నగర అధ్యక్షుడు దినేష్‌రాయల్, విద్యార్థి విభాగం నాయకులు ఓబుల్‌రెడ్డి, చెంగల్‌రెడ్డి ఆధ్వర్యంలో వెయ్యిమందికి పైగా యువత, విద్యార్థులు  యువత పోరులో పాల్గొన్నారు.

శ్రీకాకుళంలో జడివానలోనూ...
⇒ శ్రీకాకుళంలో జడివానకు పార్టీ శ్రేణులు యువతతో కలిసి నిరసన ర్యాలీ చేశారు. భారీగా తరలి­వచ్చిన జనంతో జిల్లా పరిషత్‌ ఏరియా దద్దరిల్లింది. జనమంతా వానలోనే ర్యాలీగా జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గరి నుంచి బయల్దేరారు. గంటకుపైగా నిరసన తెలి­పారు. గ్రీవెన్స్‌సెల్‌లో వినతిపత్రం అందజేశారు. 

⇒ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఓవైపు వర్షం, మరోవైపు పోలీసు ఆంక్షల వలయంలోనూ యువత పోరును విజయవంతం చేశారు. తమకు కావల్సింది యోగాంధ్ర కాదు.. ఉద్యోగాలంటూ నినదించారు. 

⇒ ఉమ్మడి విశాఖ జిల్లాలో యువత పోరు హోరెత్తింది. వర్షానికి వెరవకుండా గర్జించింది. అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా యువత తగ్గ­లేదు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల కలెక్టరేట్‌లు దద్దరిల్లాయి.

⇒ పాడేరులో జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో యువత వర్షం సైతం లెక్క చేయకుండా కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు.

పల్నాడులో లాఠీ ప్రతాపం
పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో వందలాది విద్యార్థులు, యువత శాంతియుత ర్యాలీగా వెళ్తుంటే పోలీసులు వీధి రౌడీల్లా వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వ నమ్మక ద్రోహన్ని ప్రశ్నించేందుకు జిల్లా నలుమూలల నుంచి యువత, నిరుద్యోగులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొనగా... వారిపై లాఠీలు ఝళిపించారు. దొరికిన వారిని దొరికి­నట్టు కొట్టారు. 

తొలుత వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌కు బయల్దేరిన ర్యాలీని ఎస్పీ ఆఫీసు ఎదుట బారికేడ్‌లతో అడ్డుకున్నారు. నాయకులతో పాటు 50 మందిని మాత్రమే కలెక్టరేట్‌ వైపు అను­మతిస్తామని చెప్పారు. దీనికి వైఎస్సార్‌సీపీ నాయ­కులు అంగీకరించడంతో బారికేడ్‌లను తెరిచారు. ఈ సమయంలో యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

నిరుద్యోగ భృతి రూ.3 వేలు అందించాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లిం­చాలని డిమాండ్‌ చేశారు. దీంతో పోలీసులు బారికేడ్‌ల వద్ద ఉన్నవారిపై లాఠీలతో విరుచుకు­పడడంతో యువత పరుగులు తీశారు. పారిపోయే ప్రయత్నంలో కిందపడినవారి పైనా పోలీసులు దాడి చేశారు. పలువురికి గాయాలయ్యాయి.  

మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్లమెంట్‌ పరిశీలకులు పి.గౌతమ్‌రెడ్డిలు దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, జిల్లా అధ్యక్షుడు కందుల శ్రీకాంత్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

⇒ గుంటూరు జిల్లా కలెక్టరేట్‌కు ర్యాలీగా వచ్చిన విద్యార్థులు, యువతను   లోపలకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవటంతో వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్ర­హం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలియ­జేస్తున్నామని చెప్పడంతో పది మంది ముఖ్య నేతలను వినతిపత్రం అందజేసేందుకు అనుమతించారు. 

⇒ బాపట్లలో భారీ నిరసనలతో కలెక్టరేట్‌ కిక్కిరి­సిపోయింది. పోలీసులు ఆంక్షలు విధించినా యు­వత, నిరుద్యోగులు, విద్యార్థులు అక్కడే బైఠాయిం­చారు. రథం బజారు నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ తీశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement