మక్కపేట(వత్సవాయి): ఓ యువకుడు మాయమాటలు చెప్పి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసి మోసం చేశాడని యువతితో పాటు కుటుంబసభ్యులు ఆందోళన చేసిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాధితురాలు యండ్రాతి అరుణ్య, నూతక్కి సందీప్ రెండేళ్లగా ప్రేమించుకున్నారు. అయితే గతేడాది అరుణ్య గర్భవతి కావడంతో కుటుంబసభ్యులు గమనించి వివరాలు తెలుసుకుని గ్రామంలోని పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు.
ఈ సందర్భంగా యువకుడు సందీప్ తనకు వివాహం చేసుకోవడానికి ఏడాదిన్నర సమయం కావాలని అంతేకాకుండా గర్భం కూడా తీసేసుకుంటేనే వివాహం చేసుకుంటానని పెద్దల సమక్షంలో ఒప్పుకుని కాగితాలు రాసుకున్నారు. తరువాత యువతి గర్భం తొలగించుకుంది. ఇప్పుడు ఏడాదిన్నర సమయం రావడంతో యువతి కుటుంబసభ్యులు పెద్దల దగ్గరకు వెళ్లారు.
దీంతో వాళ్లు యువకుడిని పిలిచి అడగ్గా పెళ్లి తనకు ఇష్టం లేదని తనని వివాహం చేసుకోలేనని చెప్పాడు. దీంతో ఆగ్రహించిన యువతి కుటుంభసభ్యులు స్టేషన్లో ఫిర్యాదు చేయగా పెద్దల సమక్షంలో తేల్చుకోవాలని పోలీసులు చెప్పడంతో యువతితో పాటు కుటుంబసభ్యులు మక్కపేట గాంధీ సెంటర్లో ఆందోళన చేశారు.