
వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తప్పుడు ప్రచారం
2 గంటల ప్రెస్మీట్లో అనేక విషయాలను ప్రస్తావిస్తే ఒక్కదానిపైనా మాట్లాడని చంద్రబాబు
సూపర్ సిక్స్ అమల్లో వైఫల్యం, రూ.1.60 లక్షల కోట్ల రుణ భారం,
రెడ్ బుక్ భయాందోళనలు... దేనిపైనా సమాధానం చెప్పలేని పరిస్థితి
స్పందించే దమ్మూ, ధైర్యం లేక ‘రప్పా రప్పా’ డైలాగు పేరుతో టాపిక్ డైవర్షన్
బాబు పాలనలో మోసపోయానని వైఎస్సార్సీపీ ర్యాలీలోకి వచ్చి ప్లకార్డు ప్రదర్శించిన టీడీపీ కార్యకర్త
ఆ ప్లకార్డులో ఉన్న విషయాన్ని విలేకరులు చెబితే దానిపై స్పందించిన జగన్
దాన్ని జగనే అన్నట్లు చిత్రీకరిస్తూ రంగంలోకి టీడీపీ నేతలు, ఎల్లో మీడియా
ఆ పార్టీ కార్యకర్తే రప్పా రప్పా నరికేస్తానంటే సిగ్గుపడాల్సింది చంద్రబాబే
కొద్దిరోజుల ముందే జగన్ను భూస్థాపితం చేస్తానన్న సీఎం చంద్రబాబు
మాజీ సీఎం గురించి 70 ఏళ్లున్న సీఎం ఆ మాట అనడం అంటే అర్థం ఏమిటి?
గతంలో పవన్ కళ్యాణ్, అనిత అన్న మాటల పరిస్థితి ఏమిటి?
వారన్న మాటలకు ఏ శిక్షలు పడాలి?
ఓడిపోయాడు..కానీ చావలేదు అంటూ అయ్యన్నపాత్రుని ప్రేలాపనలు
జగన్ తల నరకాలని, ఆయనకు జీవించే హక్కే లేదని బుచ్చయ్యచౌదరి శివాలు
ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతతో ఫేక్ ప్రచారాలు, వక్రీకరణలు
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రెండు గంటల తన సుదీర్ఘ మీడియా సమావేశంలో సంధించిన ప్రశ్నల్లో ఏ ఒక్క దానికి సమాధానం చెప్పే ధైర్యం లేని చంద్రబాబు తనకు అలవాటైన రీతిలో డైవర్షన్ రాజకీయానికి తెరలేపారు. రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి చంద్రబాబు చేతిలో మోసపోయారని జననేత వైఎస్ జగన్ చెబుతూ శాంతిభద్రతల వైఫల్యం, ఏడాదిలోనే రాష్ట్రం అప్పులపాలైన పరిస్థితి, సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోవడం, తాను అమలు చేసిన పథకాలను కూడా నిలిపివేయడం, ఇసుక మాఫియా, అవినీతి, మద్యం... వంటి అనేక అంశాలపై సూటిగా ప్రశ్నలు సంధించారు.
దానికి కౌంటర్గా చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించినా.. జగన్ అడిగిన ఒక్క ప్రశ్నకూ సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం ఆయనలో కనిపించలేదు. అందుకే ఎప్పుడూ చేసే మాదిరిగానే టాపిక్ డైవర్షన్ గేమ్ మొదలుపెట్టారు. నిజానికి గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఒక విలేకరి.. టీడీపీ కార్యకర్త ‘రప్పా రప్పా’ డైలాగు రాసి ప్లకార్డు పట్టుకున్న విషయాన్ని ప్రస్తావించగా.. జగన్ దానిపై స్పందిస్తూ అసలు ఆ ప్లకార్డులో ఏం రాసి ఉందో తనను ప్రశ్నించిన విలేకరులనే అడిగారు. ‘అది సినిమా డైలాగ్ కదా?’ అని మాట్లాడితే జగనే ‘రప్పా రప్పా నరికేస్తా’ అన్నట్లు ప్రచారం మొదలుపెట్టారు. దీనిపై ఐ–టీడీపీ ఒక ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. జగన్ ప్రశ్నించిన అంశాల్లో ఒక్క దానిపైనా మాట్లాడని చంద్రబాబు రప్పా రప్పా డైలాగు గురించే మాట్లాడి టాపిక్ డైవర్షన్ మొదలుపెట్టడం గమనార్హం.
దేశం కార్యకర్త నుంచే వ్యతిరేకత
వాస్తవానికి జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో టీడీపీ కార్యకర్త రవితేజ ‘రప్పా రప్పా’ అనే పుష్ప సినిమా డైలాగు రాసిన ఒక ప్లకార్డును పట్టుకున్నాడు. చంద్రబాబు పాలనలో మోసపోయానని కడుపుమండి ఒక టీడీపీ కార్యకర్త వైఎస్సార్సీపీ ర్యాలీలోకి వచ్చి అలా ప్లకార్డు పట్టుకున్నాడంటే చంద్రబాబు సిగ్గుపడాలి. కానీ వక్రీకరణలో ఆరితేరిన చంద్రబాబు ఆ విషయాన్ని నిస్సిగ్గుగా వక్రీకరించేశారు. ఆ వాదనకు మద్దతుగా ఎల్లో మీడియా, ఆయన సోషల్ మీడియా, పవన్ కళ్యాణ్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పయ్యావుల కేశవ్ వంటి కొన్ని పాత్రలను రంగంలోకి దింపారు. ఏడాదిలో ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేక, జగన్ అడిగిన వాటికి సమాధానం చెప్పలేక ఇలాంటి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నట్లు అర్థమవుతోంది.
వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు ఫేక్ ప్రచారాలు
చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్లు, 143 హామీల అమలు వైఫల్యం గురించి, ఏడాదిలోనే రూ.1.60 లక్షల కోట్లకు దాటిపోయిన అప్పుల గురించి, రెడ్బుక్ రాజ్యాంగం ప్రకారం వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై పెడుతున్న తప్పుడు కేసులు.. చేస్తున్న దాడులు, దౌర్జన్యాల గురించి.. అనేక ప్రజా సమస్యల గురించి వైఎస్ జగన్ ప్రశి్నస్తే వాటిపై స్పందించకుండా కేవలం ఆయన అనని మాటలను వక్రీకరిస్తూ విష ప్రచారానికి దిగడాన్ని బట్టి వారికి చెప్పుకోవడానికి ఏమీ లేదని స్పష్టమైంది.
అమరావతి పేరుతో అవినీతి, ఇసుక, మద్యం దోపిడీ, ఎమ్మెల్యేల అవినీతితోపాటు మొత్తంగా చంద్రబాబు పాలనపై ఏడాదిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు తాజా ఘటనలతో స్పష్టమవుతోంది. మరోవైపు జగన్మోహన్రెడ్డి పర్యటనలకు తరలివస్తున్న జనాన్ని చూసి కళ్లల్లో విషం నింపుకున్న కూటమి నేతలు తమకు అలవాటైన రీతిలో డైవర్షన్ రాజకీయానికి మరింత పదునుపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ తమకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని రాష్ట్రంలోని ప్రతి ఇంట్లోనూ, ప్రతి వ్యక్తి చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించే పరిస్థితి వస్తుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
జగన్ను భూస్థాపితం చేస్తానని ఇటీవలే నోరుపారేసుకున్న చంద్రబాబు
‘డైలాగులు సినిమాలకే సరిపోతాయంటూ’ చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం పవన్ కళ్యాణ్ షూటింగ్ల బిజీలోనూ స్పందించారు. వాస్తవానికి ఎన్నికలకు ముందు ‘కొడకల్లారా.. తోలు తీస్తాం.. తొక్క తీస్తాం’ అంటూ వైఎస్సార్సీపీ నేతలపై ఇష్టం వచ్చినట్లు నోరుపారేసుకుంటూ పూనకం వచ్చినట్లు మాట్లాడింది ఆయనే. అంతెందుకు ఇటీవలే ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు.. జగన్ను భూస్థాపితం చేస్తానని అన్నారు. సీఎం స్థాయిలో 70 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తి.. ఒక మాజీ సీఎంను, ప్రతిపక్ష నేతను ఆ మాట అనడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీన్ని చంద్రబాబు ఎలా సమర్ధించుకుంటారు? ఎన్నికలకు ముందు అంగళ్లు సభలో చంద్రబాబు స్వయంగా అల్లర్లు సృష్టించి పోలీసులపై దాడులు చేయించారు.
ఈ దాడిలో రణ«దీర్ అనే కానిస్టేబుల్పై దాడి చేసి కన్ను పోగొట్టారు. జగన్ను గాజుగ్లాసుతో పొడవండి.. రాళ్లతో కొట్టండి.. సీసం పోసి చంపండి అని రెచ్చిపోయి మాట్లాడింది చంద్రబాబే. ఇప్పుడు హోం మంత్రిగా ఉన్న అనిత అప్పట్లో జగన్పై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం స్పీకర్గా ఉన్న అయ్యన్నపాత్రుడు జగన్ను భౌతికంగా లేకుండా చేయాలని అన్న వీడియో బయటకు వచ్చింది.
అంత బరితెగించి మాట్లాడిన వారికి ఏం శిక్ష పడాలి? ఇప్పుడు కూడా డైవర్షన్ రాజకీయాలు చేస్తూ, అందులో భాగంగా జగన్ తల నరికేయవచ్చు కదా? అసలు ఆయనకు జీవించే హక్కు ఉందా? అని టీడీసీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరితో చంద్రబాబు తన కడుపులోని విషాన్నంతా కక్కించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అన్యాయాలు, నిర్భంధాలు, నోరెత్తితే అక్రమ కేసులు పెట్టి జైళ్ల పాలు చేస్తున్న వైనంపై జగన్ మాట్లాడితే బుచ్చయ్యచౌదరి దాన్ని వక్రీకరించి నక్సలైట్లను తయారు చేస్తావా? అంటూ తన నోటికి అడ్డూఅదుపూ లేదని నిరూపించారు.