సాక్షి, విజయవాడ: తన భర్త అక్రమ సంబంధాలు పెట్టుకుని తనని చంపడానికి యత్నిస్తున్నాడని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన మహిళ.. విజయవాడ మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రాజమండ్రిలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మహిళలతో ఏకాంతంగా ఉన్న వీడియోలు చిత్రీకరిస్తున్నాడని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. వీడియోలు అడ్డం పెట్టుకుని మహిళలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని బాధిత మహిళ తెలిపింది.
‘‘నా భర్తను 2017లో ప్రేమ వివాహం చేసుకున్నాను. రెండేళ్లు నన్ను భాగానే చూసుకున్నాడు. పెళ్లికి ముందు నుంచి అక్రమ సంబంధాలు ఉన్నాయని నాకు తెలిసింది. వ్యాపారం పేరుతో నా దగ్గర 100 గ్రాముల బంగారం, రూ.60 లక్షలు బ్యాంకు లోన్లు, రెండు ప్లాట్స్ తీసుకున్నాడు. మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. 50 మంది అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు.
..అమ్మాయిలతో ఏకాంతంగా ఉన్న వీడియోస్ తీసుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నాతో ఉన్న వీడియోలు తీసుకుని కూడా బ్లాక్ మెయిల్ చేశాడు. మే 4 తేదీన నన్ను కొట్టాడు. నన్ను చంపుతానని బెదిరించాడు. ఆయనకు భయపడి నేను పారిపోయి వచ్చాను. నాకు నా భర్తతో ప్రాణహాని ఉంది. విజయవాడ మహిళ పోలీస్ స్టేషన్ లో కంప్లెంట్ ఇచ్చాను. న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నాను’’ ఆమె పేర్కొంది.


