వక్ఫ్‌ బోర్డు పునర్నియామకం | Waqf Board reappointment | Sakshi
Sakshi News home page

వక్ఫ్‌ బోర్డు పునర్నియామకం

Dec 7 2024 4:45 AM | Updated on Dec 7 2024 4:45 AM

Waqf Board reappointment

నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రభుత్వం 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వక్ఫ్‌ బోర్డును ప్రభుత్వం పునర్నియమించింది. మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి కె.హర్షవర్థన్‌ శుక్రవారం దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ జారీ చేశారు. వక్ఫ్‌ యాక్ట్‌–1995 సవరణ చట్టం–2013(సెక్షన్‌ 27) ప్రకారం 8మందితో ఆంధ్రప్రదేశ్‌ వక్ఫ్‌బోర్డు సభ్యుల నియామకం చేపట్టినట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఎన్నికైన సభ్యుల నుంచి ఎండీ రుహుల్లా(ఎమ్మెల్సీ), షేక్‌ ఖాజా(ముతవల్లీ)లను నియమించింది. 

మహ్మద్‌ నసీర్‌(ఎమ్మెల్యే), సయ్యద్‌ దావుద్‌ బాషా బాక్వీ, షేక్‌ అక్రమ్, అబ్దుల్‌ అజీజ్, హాజీ ముకర్రమ్‌ హుస్సేన్, మహ్మద్‌ ఇస్మాయేల్‌ బేగ్‌లను వక్ఫ్‌బోర్డు సభ్యులుగా నామినేట్‌ చేసింది.  తలా తోకలేని జీవో విడుదల చేసిన ప్రభుత్వం వక్ఫ్‌బోర్డు కమిటీ నియామకంలో కూటమి ప్రభుత్వం తలాతోక లేని జీవో ఇచ్చిందని ఏపీ ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ నాగుల్‌ మీరా శుక్రవారం ఒక ప్రకటనలో తప్పుబట్టారు. 

గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేసిన కూటమి ప్రభుత్వం పునర్నియామక జీవో ఇవ్వడంలో కూడా నిబంధనలు పాటించలేదన్నారు. పునర్నియామకం అంటే గత జీవో ఏ సెక్షన్ల కింద సభ్యుల నియామకం జరిగిందో అదే సెక్షన్ల మేరకు సభ్యుల నియామకం చేయాలన్నారు. అందుకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో ఇచ్చిoదన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌లో ఎంపీ, అడ్వకేట్, మహిళా, అధికారిక విభాగాల నుంచి సభ్యులకు చోటు లేకుండా చేశారని నాగుల్‌ మీరా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement