సాక్షివిశాఖ: సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు ప్రమాదానికి గురైంది. రాకాసి అలల తాకిడికి బోటు బోల్తా పడటంతో ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ ప్రమాదం నుంచి కారె చిన్న అనే మత్స్యకారుడు ప్రాణాలతో సురక్షితంగా బయటపడగా, మిగిలిన ఆరుగురి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ప్రస్తుతం కారె చిన్నకు కోస్ట్ గార్డ్ నౌకలోనే అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. గల్లంతైన మిగిలిన మత్స్యకారుల కోసం కోస్ట్ గార్డ్ సిబ్బంది సముద్రంలో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
ఈ ప్రమాద సమాచారం తెలిసినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం నుంచి సరైన స్పందన లేకపోవడంతో మత్స్యకార కుటుంబాలు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇంత పెద్ద కష్టం వస్తే ప్రభుత్వం నుంచి కనీసం ఒక్కరంటే ఒక్క ప్రజాప్రతినిధి గానీ, ఉన్నతాధికారి గానీ మమ్మల్ని పరామర్శించడానికి రాలేదు. మా బాధను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. సముద్రంలో చిక్కుకున్న మా వారు ఎలా ఉన్నారో, ఎక్కడున్నారో తెలియక మేము ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతుంటే అధికారులకు కనీస చలనం లేదు’అంటూ బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.

సహాయక చర్యల్లో జాప్యాన్ని నిరసిస్తూ మత్స్యకారులు, బాధితుల బంధువులు భారీ సంఖ్యలో ఫిషరీస్ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయం ముందు బైటాయించి అధికారులను నిలదీశారు. బోటు ప్రమాదానికి గురవుతోందని ముందే సమాచారం అందినప్పటికీ అధికారులు ఎందుకు తక్షణమే స్పందించలేదని, ఈ నిర్లక్ష్యానికి కారణం ఎవరని మత్స్యకార సంఘాల నేతలు నిలదీశారు. గల్లంతైన వారిని కాపాడటానికి గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని, తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని కార్యాలయం ఎదుట రోడ్డుపైనే భీష్మించుకు కూర్చున్నారు.


