అడిషనల్ కమిషనర్ భార్గవ్ తేజపై వడ్డమాను రైతు ఆరోపణ
లాభం రాదని నా పరిహారం ఫైల్ పక్కన పడేశాడు
హైలెవల్ కమిటీ, కమిషనర్ అనుమతించినా ఏసీ క్లియర్ చేయడంలేదు
నేనిచ్చిన అగ్రిమెంట్ రద్దుచేసి నా భూమిని నాకిచ్చేయండి
తాడికొండ: మంత్రులు లోకేశ్, నారాయణకు సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ భార్గవ్ తేజ బినామీ అని రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు మండలం వడ్డమాను గ్రామానికి చెందిన రైతు చుండు నర్సిరెడ్డి ఆరోపించారు. లంచం ఇవ్వకపోవడంతో రాజధానికి రెండో విడతలో ఇచ్చిన తన కోళ్ల ఫారం, హలో బ్రిక్స్ కంపెనీ భూములకు పరిహారం ఇచ్చేందుకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. లంచం ఇస్తేనే ఇక్కడ ఫైలు కదులుతుందని అన్నారు. శనివారం వడ్డమానులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భార్గవ్ తేజకు లాభం ఉంటే ఏ పూటకు ఆ పూట ఫైల్ క్లియర్ చేస్తున్నారని, లాభం రాదనే నా పరిహారం ఫైల్ పక్కన పడేశారని ఆరోపించారు.
తాను రెండో విడత పూలింగ్ కోసం మొత్తం 13 ఎకరాలను ఇస్తే అందులో రెండు ఎకరాల్లో కోళ్ల ఫారం, 82 సెంట్లలో హలో బ్రిక్స్ ప్లాంటు ఉన్నాయన్నారు. వీటికి పరిహారం కోసం ఎన్నిసార్లు తిరిగినా ఉపయోగం లేకపోయిందన్నారు. మే 7వ తేదీన ‘సాక్షి’లో ప్రచురితమైన ‘పరిహారానికి పదేళ్లా’ అనే కథనంతో ఫైల్ ముందుకు కదిలి జిల్లా కలెక్టర్, మంత్రులతో కూడిన హైలెవల్ కమిటీ అనుమతి వచ్చిందని తెలిపారు. సీఆర్డీఏ కమిషనర్ కూడా పరిహారం విడుదల చేయాలని చెప్పారని, అయినా అడిషనల్ కమిషనర్ భార్గవ్ తేజ తన ఫైల్ను పక్కన పడేశారని అన్నారు.
తనకంటే వెనుక వచ్చిన పెదపరిమిలో 74 ఎకరాల ఫైల్ను 5 నిమిషాల్లో క్లియర్ చేసి రియల్ ఎస్టేట్ వెంచర్లకు అనుమతులు జారీ చేసి రూ.50 లక్షలు లంచం తీసుకున్నారని ఆరోపించారు. లాభం ముట్టినందునే తుళ్లూరు ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో ఎలాంటి భవనాలు లేకున్నా రూ.3 కోట్లు పరిహారం విడుదల చేశారని అన్నారు. తన బ్రిక్స్ కంపెనీ, కోళ్ల ఫారానికి కలిపి సుమారు రూ.10 కోట్ల వరకు పరిహారం వస్తుందన్నారు.
రెడ్లు ఆర్థికంగా స్థిరపడకూడదనే ఆలోచన కూడా ఆయనలో ఉందన్నారు. భార్గవ్ తేజ మంత్రులు లోకేశ్, నారాయణకు బినామీగా వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. సీఆర్డీఏకు తానిచ్చిన అగ్రిమెంట్ రద్దుచేసి తన భూమిని తిరిగిచ్చేస్తే వ్యవసాయం, కోళ్ల ఫారం వ్యాపారం చేసుకుంటానని చెప్పారు. తనను ఇలా ఇబ్బందులకు గురిచేయడం పద్ధతి కాదని నర్సిరెడ్డి అన్నారు.


