
ఈదురు గాలులతో కూడిన వర్షాలకు దెబ్బతిన్న మామిడి తోటలు
ఎన్టీఆర్, కృష్ణా, ఉభయ గోదావరి, రాయలసీమ జిల్లాల్లో అపార నష్టం
ఎకరాకు 1.5 టన్నుల దిగుబడి కూడా కష్టమే
బంగినపల్లి టన్ను రూ.15 వేల నుంచి రూ.45 వేల మధ్య ధర
ఇలాంటి గడ్డు పరిస్థితి ఎన్నడూ చూడలేదంటున్న రైతులు
మామిడి రైతుల ఆశలు పూర్తిగా అడుగంటిపోయాయి. మొదట్లో నల్లతామర, మాంగో లూఫర్ వంటి పురుగుల దాడితో పూత మాడిపోయింది. ఆ తర్వాత తెగుళ్లు, చీడపీడలకు తోడు అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో పిందెలు పురుగుపట్టి రాలిపోయాయి. వాతావరణాన్ని తట్టుకుని నిలిచిన కొద్దిపాటి పిందెలు కాయ కడుతున్న వేళ విరుచుకుపడిన వర్షాలు, ఈదురు గాలులకు పూర్తిగా నేలరాలిపోయాయి. ఈదురు గాలులకు వడగండ్ల వానలు తోడవడంతో మామిడి రైతులకు అపార నష్టం వాటిల్లింది. మరోవైపు నాణ్యత లేదనే సాకుతో మార్కెట్లో ధర దక్కక రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. – సాక్షి, అమరావతి/నెట్వర్క్
3 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంట
రాష్ట్రంలో దాదాపు 10 లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతుండగా.. ఈ ఏడాది నల్లతామర, చీడపీడల ప్రభావానికి తొలుత 50 శాతానికి మించి దిగుబడులొచ్చే అవకాశాలు లేవని సీజన్ ప్రారంభంలోనే అంచనా వేశారు. ప్రస్తుతం 50 శాతం వచ్చే పరిస్థితి కూడా కని్పంచడం లేదు. రాయలసీమ జిల్లాల్లో ఎకరాకు 2–3 టన్నుల మధ్య దిగుబడులొస్తాయని అంచనా వేయగా.. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశి్చమ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో టన్నున్నర రావడం కూడా కష్టంగా ఉందని చెబుతున్నారు.
ఈ నెల 7, 8 తేదీల్లోనూ, తిరిగి 13, 14 తేదీల్లోనూ వరుసగా ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురవడంతో దాదాపు 3 లక్షల ఎకరాల్లో కాయలు నేల రాలినట్టు అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్, కృష్ణా, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఈ నష్టం ఎక్కువగా వాటిల్లినట్టు చెబుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోనే 50వేల ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న మామిడికాయలు నేలరాలినట్టుగా అంచనా వేశారు.
రాష్ట్రంలోనే అత్యధిక విస్తీర్ణంలో మామిడి తోటలున్న ఈ జిల్లాలో దాదాపు 1.76 లక్షల టన్నుల కాయల దిగుబడులొస్తాయని అంచనా వేయగా.. చివరకు 50వేల టన్నులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. కృష్ణా జిల్లాలో మరో 30–40 వేల ఎకరాల్లో మామిడి నేలరాలగా.. అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో దాదాపు వెయ్యి ఎకరాల్లో మామిడి పంట ఈదురుగాలులకు దెబ్బతిన్నట్టు అంచనా వేశారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కనీసం 25–35 శాతం కూడా దిగుబడులొచ్చే అవకాశాలు కనిపించడం లేదని అధికారులే చెబుతున్నారు.
ధరలూ అంతంతే
మామిడి కాయల్లో నాణ్యత లేదనే కారణంతో ఈసారి ఆశించిన ధరలు కూడా లభించని పరిస్థితి నెలకొంది. నూజివీడు రసాలు టన్ను రూ.10 వేల నుంచి రూ.15వేల మధ్య పలుకుతుండగా.. బంగినపల్లి రూ.15 వేల నుంచి రూ.45 వేల మధ్య పలుకుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లో పండే అల్పాన్స్ రకాలకు మాత్రమే నాణ్యతను బట్టి అత్యధికంగా రూ.95 వేల వరకు ధర లభిస్తోందని చెబుతున్నారు. రాయలసీమలో ఈ స్థాయి ధరలు పొందే రైతులు నూటికి 10 శాతం మంది కూడా ఉండరని చెబుతున్నారు.
పంటల బీమాకు దూరం
ఈదురు గాలుల వల్ల లక్షలాది ఎకరాల్లో కాయలు నేలరాలినప్పటికీ నిబంధనల సాకుతో అధికారులు పంట నష్టాన్ని ప్రాథమికంగా కూడా గుర్తించడం లేదు. మరోవైపు రబీలో చివరి నిముషంలో పంటల బీమా వర్తింప చేసినా గడువు తక్కువగా ఉండటం, ప్రీమియం భారం అధికంగా ఉండటంతో రైతులెవరూ బీమా చేయించుకోలేకపోయారు. ఫలితంగా ఏ ఒక్కరికీ బీమా పరిహారం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
ఈదురు గాలులు దెబ్బతీశాయి
ఈ ఏడాది పూత చాలా ఆలస్యంగా వచి్చంది. పూతను కాపాడుకోవడానికి నానాతంటాలు పడ్డాం. అప్పులు తెచ్చి 13 ఎకరాలకు మందులు పిచికారీ చేశాం. దిగుబడి పర్వాలేదనుకుంటున్న తరుణంలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పంటను దెబ్బతీశాయి. గడచిన రెండ్రోజుల్లో కురిసిన వర్షానికి 13 ఎకరాల్లో పిందె దశలో ఉన్న మామిడి చాలావరకు నేలరాలింది. మిగిలిన కొద్దిపాటి కాయలైనా చేతికొస్తాయో లేదో తెలియడం లేదు. ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోవాలి. – నాయనిరెడ్డి, వెజ్జుపల్లి, చిత్తూరు జిల్లా
చేతికందే దశలో పంట పోయింది
నేను మూడెకరాల మామిడి తోట కౌలుకు తీసుకున్నాను. సొంతంగా ఎకరం తోట ఉంది. సీజన్ ప్రారంభంలో తేనె మంచు, వాతావరణం అనుకూలించక కాపు తగ్గింది. పురుగు మందులకు ఎకరానికి రూ.45 వేలు ఖర్చు చేశాను. ఎండ తీవ్రతకు 20 శాతం పిందెలు, కాయలు రాలిపోయాయి. మామిడి కాయలు చేతికి వస్తాయనుకుంటున్న తరుణంలో అకాల వర్షం, ఈదురు గాలులకు పంట నష్టం వాటిల్లింది. సగం పంట రాలిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలి. – గండి రమణ, రైతు, తుని, కాకినాడ జిల్లా