సాక్షి తిరుపతి: భక్తుల సౌకర్యార్థంతో పాటు పరిపాలనా అవసరాల దృష్ట్యా టీటీడీ దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో మార్పులు చేపట్టింది. ఇది వరకూ తిరుమలలో ఆఫ్లైన్ కౌంటర్ల ద్వారా జారీ చేస్తున్న టికెట్లను జనవరి 9 నుండి ఆన్లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో అందించనున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం తిరుమలలో 800 శ్రీవాణి దర్శన టికెట్లను రోజువారి విధానంలో ఆఫ్లైన్ ద్వారా జారీ చేస్తున్నారు. వాటిని జనవరి తొమ్మిది నుంచి ఆన్లైన్ ద్వారా రోజూవారి కరెంట్ బుకింగ్లోకి మార్చనున్నారు. ఈ టికెట్లను ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేసి, మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంచుతారు. టికెట్ పొందిన భక్తులు అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనానికి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
ఈ టికెట్లు ఒక్క కుటుంబంలో 1+3 సభ్యులు (మొత్తం నలుగురు) మాత్రమే టికెట్ బుకింగ్కు అనుమతి ఉంటుంది. టికెట్ బుకింగ్లో దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఆధార్ ధృవీకరణ, మొబైల్ నంబర్ వివరాలు తప్పనిసరి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానంలో టికెట్లు అందజేయనున్నట్లు దేవస్థానం ప్రకటించింది. ఈ నూతన విధానాన్ని నెల రోజులపాటు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.
అదేవిధంగా రోజుకు 500 శ్రీవాణి దర్శన టికెట్లను ఆన్ లైన్ అడ్వాన్స్ బుకింగ్ విధానంలో ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. మూడు నెలల అనంతరం ఈ విధానంపై సమీక్షించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని టీటీడీ తెలిపింది. తిరుపతి విమానాశ్రయంలో ప్రతిరోజూ భక్తులకు ఆఫ్ లైన్ విధానంలో జారీ చేస్తున్న 200 టికెట్ల జారీ విధానం కూడా యథావిధిగా కొనసాగనుందని పేర్కొంది.


