ముగ్గురు అరెస్ట్
తిరుమల: తిరుమలలో గదుల కోసం భక్తులు పడుతున్న ఇబ్బందులను సొమ్ము చేసుకోవడమే లక్ష్యంగా.. నకిలీ ఆధార్ కార్డులతో గదులు పొందుతూ అధిక ధరలకు విక్రయిస్తున్న ముగ్గురిని శుక్రవారం పోలీసులు అరెస్టుచేశారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకున్నారు.
అధికార వర్గాల కథనం ప్రకారం... మహారాష్ట్రలోని హింగోలి జిల్లాకు చెందిన గంగా ప్రసాద్ కేశవరావ్ ఖరోడే (34), వైఎస్సార్ జిల్లా బద్వేలుకు చెందిన వందవాసి దినేష్ (27), తెలంగాణ ఖమ్మంకు చెందిన పత్తిపాటి కిశోర్ కుమార్ (33) మొబైల్ ఫోన్ల ద్వారా ఆధార్ కార్డుల ఫోటోలు, నంబర్లు మార్ఫింగ్ చేసి నకిలీ కార్డులు తయారు చేసేవారు. ఆ కార్డులతో సీఆర్ఓ కార్యాలయంలో రూ.50 లేదా రూ.100 చెల్లించి గదులు పొందేవారు.
అనంతరం టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధికంగా ఒక్కో గదిని రూ.1,000 నుంచి రూ.3,000 వరకు విక్రయించేవారు. ఒకే గదిని రెండు లేదా మూడుసార్లు వేర్వేరు భక్తులకు ఇచ్చి మోసం చేసిన ఘటనలు కూడా బయటపడ్డాయి. నిందితుల నుంచి ఆరు నకిలీ ఆధార్ కార్డులు, రెండు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు స్వాదీనం చేసుకుని నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశాలు ఇచ్చారు.


