గుంటూరు జిల్లా: ఒక లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. పెను ప్రమాదానికి దారి తీసింది. ఏకంగా మూడు కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. నుజ్జునుజ్జయిన లారీ క్యాబిన్లలో ఇరుక్కుపోయి బయటకు రాలేక వారు పెట్టిన హాహాకారాలు, మీదకొస్తున్న అగ్ని కీలల నుంచి కాపాడమని చేసిన ఆర్తనాదాలు చూపరులను కలచివేశాయి. లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. ముగ్గురిని అక్కడికక్కడే సజీవ దహనం చేసింది. ఏ మృతదేహం ఎవరిదో కూడా గుర్తుపట్టలేని స్థితిలో పూర్తిగా కాలిపోయిన విషాద ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం బోయపాలెం హైవేపై చోటుచేసుకుంది.
పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు... నంద్యాల జిల్లా బేతంచర్ల నుంచి నాపరాయి లోడుతో మచిలీపట్నం వైపు ఓ లారీ వెళుతోంది. మరోవైపు బుధవారం వేకువజామున గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం బోయపాలెం 16వ నంబరు జాతీయ రహదారిపై డీజిల్ అయిపోయి మధ్య లైనులో కోళ్ల దాణా లోడు లారీ అడ్డంగా నిలిచిపోయింది. దీనిని తప్పించబోయి.. అదుపు తప్పిన మొదటి లారీ అక్కడి డివైడర్ను ఢీకొట్టి, అవతల రోడ్డులోకి దూసుకెళ్లింది.
అదే సమయంలో భద్రాచలం నుంచి బెంగళూరుకు పేపర్ బండిల్స్ లోడుతో వెళ్తున్న లారీని నాపరాయి లోడు లారీ ఎదురు నుంచి ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో నాపరాయి లోడు లారీ నడుపుతున్న నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం నేరేడుచర్ల గ్రామానికి చెందిన మేకల రవికుమార్ (36), అదే గ్రామానికి చెందిన డ్రైవరు రమేశ్ (35)తోపాటు పేపర్ లోడ్లారీ నడుపుతున్న కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా శెట్టిగన్పల్లి గ్రామానికి చెందిన ధర్మపతి (26) మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఏ మృతదేహం ఎవరిదో కూడా కనుక్కోలేని విధంగా పూర్తిగా ఆహుతయ్యాయి.
చిన్న పిల్లలున్నారయ్యా..
ప్రమాదంలో నాపరాయి లోడు లారీ నడుతుపుతున్న డ్రైవర్ మేకల రవికుమార్ పెట్టిన ఆర్తనాదాలు గుండెలను పిండేశాయి. ‘నాకు ఇంటి దగ్గర చిన్న పిల్లలున్నారయ్యా, ఎవరైనా కాపాడండి’ అంటూ పెద్దగా కేకలు వేశాడు. గమనించిన స్థానికులు కొందరు క్యాబిన్లో ఇరుక్కుపోయిన ఆయన్ను డోర్లు తీసి బయటకు లాగేందుకు తీవ్రప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ లోతుగా ఇరుక్కుపోవడంతో సాధ్యపడలేదు. ఇంతలో మంటలు చెలరేగి అందరూ చూస్తుండగానే రవికుమార్ అగ్నికి ఆహుతయ్యాడు. ఆయన ఆఖరి మాటలు అందరి హృదయాలను కలిచివేశాయి. రవికుమార్కు భార్య, ఒకటో తరగతి చదువుతున్న అని్వక, ఐదో తరగతి చదువుతున్న మనోజ్లు ఉన్నారు.
శాశ్వత నిద్రలోనికి..
ఇదే లారీలో డ్రైవరుగా ఉన్న రమేశ్ ప్రమాదం జరిగిన సమయంలో క్యాబిన్లో ఉన్న బెడ్పై గాఢ నిద్రలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఎదురుగా లారీని బలంగా ఢీకొట్టడంతో నిద్రిస్తున్న రమేశ్ బెడ్పై నుంచి ముందుకొచ్చి లారీ లోపల ముందు భాగంలో బోర్లా పడి ఇరుక్కుపోయాడు. మంటల్లో చిక్కుకుని గిలగిల కొట్టుకుంటూ తుదిశ్వాస విడిచాడు. పేపర్ లోడు లారీ నడుపుతున్న ధర్మపతి నుజ్జునుజ్జుయిన క్యాబిన్లో చిక్కుకుపోయాడు. మంటలు క్షణాల వ్యవధిలోనే వ్యాపించడంతో బయట పడలేకపోయాడు. మృతదేహం అగ్ని కీలల్లో చిక్కుకుని 70 శాతం వరకు కాలిపోయింది. మిగిలిన ఇద్దరి మృతదేహాల ఆనవాళ్లు బయటకు కనిపిస్తున్నప్పటికీ ధర్మపతి మృతదేహం ఎక్కడుందో కూడా గుర్తుపట్టడం కొంత ఇబ్బందికరంగా మారింది.
ప్రమాదం గుంటూరు–పల్నాడు జిల్లాల సరిహద్దులో జరగడంతో పరిధి ఎవరిదనే అంశంపై కొంత సేపు మీమాంస చోటుచేసుకుంది. అనంతరం రెవెన్యూ అధికారులు సరిహద్దు నిర్ధారించడంతో ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీబీల సాయంతో సుమారు ఎనిమిది గంటలు శ్రమించి లారీ శకలాలను పక్కకు తీయించారు. సాయంత్రం మూడు గంటల సమయానికి ఒకవైపు హైవే ట్రాఫిక్ను క్లియర్ చేశారు.


