సాక్షి,పల్నాడు జిల్లా: పెదకూరపాడు నియోజకవర్గం కోనూరు గ్రామం వద్ద కృష్ణా నదిలో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. కుంకలగుంట నుంచి కోనూరులోని ఒక ఫంక్షన్కు వచ్చిన 10 మంది నది దాటేందుకు పడవ ఎక్కారు. మధ్యలో పడవ ఒక్కసారిగా బోల్తా పడడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించారు. వారిలో ఐదుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఒకరి మృత దేహం కోసం ఈతగాళ్లు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
పడవ ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానికులు బాధితుల కోసం సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
ఇసుక కోసం తవ్విన గుంతలు పడవకు అడ్డంకిగా మారి ప్రమాదానికి కారణమయ్యాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక కోసం తవ్వకాలు జరగకపోయి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదని అంటున్నారు. ఇలాంటి తవ్వకాలను అధికారులు నియంత్రించకపోతే మరిన్ని ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.


