ఇక జిల్లాలుగా పోలవరం, మదనపల్లె, మార్కాపురం
రంపచోడవరం కేంద్రంగా ఒకే ఒక్క నియోజకవర్గంతో పోలవరం జిల్లా
ప్రస్తుత పోలవరం ఏలూరు జిల్లాలోనే కొనసాగింపు
మొత్తంగా 26 నుంచి 29కి పెరగనున్న జిల్లాల సంఖ్య
కొత్తగా మరో ఐదు రెవెన్యూ డివిజన్లు.. ఇప్పుడున్న వాటిలో మార్పులు
రాష్ట్ర ప్రభుత్వం ఖరారు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా పోలవరంతోపాటు మార్కాపురం, మదనపల్లె జిల్లాలను ఏర్పాటు చేయనున్నారు. రంపచోడవరం కేంద్రంగా కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాత పోలవరం ప్రాంతంలో ఎలాంటి మార్పులు చేయకుండా ఏలూరు జిల్లాలోనే కొనసాగించనుంది. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లు కలిపి కొత్తగా పోలవరం జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు.
జిల్లాల పునర్విభజన కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదికపై సీఎం చంద్రబాబు సచివాలయంలో మంగళవారం చర్చించి ఖరారు చేశారు. కొత్తగా ఏర్పాటయ్యే ఈ మూడు జిల్లాలతో రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 29కి పెరగనుంది. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి.
అనకాపల్లి జిలా్లలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లె జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లె, శ్రీసత్యసాయి జిల్లాలో మడకశిర రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని విభజించి కొత్తగా పెద్దహరివాణం మండలాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
3.49 లక్షల జనాభాతో పోలవరం జిల్లా
పాడేరు కేంద్రంగా ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాను విడగొట్టి పోలవరం జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు. కేవలం రంపచోడవరం నియోజకవర్గంతో 3.49 లక్షల అతి తక్కువ జనాభాతో ఈ జిల్లా ఏర్పాటవుతోంది. రాష్ట్రంలో అతి చిన్న జిల్లా ఇదే కాబోతోంది. రంపచోడవరం రెవెన్యూ డివిజన్లో రంపచోడవరం, దేవీపట్నం, వై రామవరం, గుర్తేడు, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి మండలాలు.. చింతూరు డివిజన్లోని యెటపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాలతో ఈ జిల్లా ఏర్పాటు కానుంది.
ప్రకాశం జిల్లాను విడగొట్టి కొత్తగా మార్కాపురం జిల్లా
ప్రకాశం జిల్లాను విభజించి మార్కాపురం, కనిగిరి రెవెన్యూ డివిజన్లతో కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పాటు కానుంది. యర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉండనున్నాయి.
మార్కాపురం రెవెన్యూ డివిజన్లోని యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు, తర్లుపాడు, మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల మండలాలు.. కనిగిరి డివిజన్లోని హనుమంతునిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పెదచెర్లోపల్లి, చంద్రశేఖరపురం, పామూరు, గిద్దలూరు, బెస్తవారిపేట, రాచర్ల, కొమరోలు, కంభం, అర్ధవీడు మండలాలు కొత్త జిల్లాలో ఉండనున్నాయి. 11.42 లక్షల జనాభాతో ఈ జిల్లా ఏర్పాటు కానుంది.
పీలేరు, మదనపల్లె రెవెన్యూ డివిజన్లతో మదనపల్లె జిల్లా
మదనపల్లె, పీలేరు రెవెన్యూ డివిజన్లతో కొత్తగా మదనపల్లె జిల్లా ఏర్పాటు కానుంది. మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉండనున్నాయి. మదనపల్లె రెవెన్యూ డివిజన్లోని మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం, తంబళ్లపల్లె, ములకల చెరువు, పెదమండ్యం, కురబలకోట, పీటీ సముద్రం, బీరొంగి కొత్తకోట, చౌడేపల్లె, పుంగనూరు మండలాలు.. పీలేరు డివిజన్లోని సదుం, సోమల, పీలేరు, గుర్రంకొండ, కలకడ, కంభంవారి పల్లె, కలికిరి, వాల్మీకిపురం మండలాలు ఈ జిల్లాలో ఉండనున్నాయి.
చెదిరిపోతున్న 17 జిల్లాలు
ఈ పునర్వ్యస్థీకరణతో 17 జిల్లాలు చెదిరిపోతున్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో పార్లమెంటు నియోజకవర్గం ప్రాతిపదికగా ఏర్పాటైన జిల్లాల స్వరూపం చాలా వరకు మారిపోనుంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, అనంతపురం జిల్లాల్లో ఎలాంటి మార్పులు జరగలేదు. మంత్రుల కమిటీ చేసిన ఈ ప్రతిపాదనలను ఈ నెల 28వ తేదీన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఆమోదించనున్నారు.
డివిజన్లు, మండలాల్లో మార్పులు
» శ్రీకాకుళం జిల్లా పలాస డివిజన్లోని నందిగాం మండలాన్ని టెక్కలి డివిజన్లో కలపనున్నారు.
» అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట, యలమంచిలి నియోజకవర్గాల్లోని మండలాలతో కొత్తగా నక్కపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది.
» కాకినాడ డివిజన్లోని సామర్లకోట మండలాన్ని పెద్దాపురం డివిజన్లో కలుపుతున్నారు.
» అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం, మండలాలను రాజమహేంద్రవరం డివిజన్లో కలపనున్నారు.
» పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ మండలం పేరు వాసవీ పెనుగొండ మండలంగా మారనుంది.
» బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపనున్నారు. అద్దంకి, దర్శి నియోజకవర్గాలతో కొత్తగా అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది.
» కనిగిరి రెవెన్యూ డివిజన్లో ఉన్న మర్రిపూడి, పొన్నలూరు మండలాలను కందుకూరు రెవెన్యూ డివిజన్లో కలపనున్నారు.
» కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో విలీనం చేయనున్నారు.
» నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని కలువాయి, రాపూర్, సైదాపురం మండలాలను తిరుపతి జిల్లా గూడూరు డివిజన్లో కలపనున్నారు.
» పలమనేరు డివిజన్లోని బంగారుపాళ్యం మండలాన్ని చిత్తూరు డివిజన్లో కలుపుతున్నారు.
» సదుం, సోమల, పీలేరు, గుర్రం కొండ, కలకడ, కేబీ పల్లి, కలికిరి, వాల్మీకిపురం మండలాలతో పీలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది.
» పలమనేరు డివిజన్లోని చౌడేపల్లి, పుంగనూరు మండలాలను మదనపల్లె రెవెన్యూ డివిజన్లో కలపనున్నారు.
» వైఎస్సార్ కడప జిల్లాలోని ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలను రాజంపేట రెవెన్యూ డివిజన్లో కలపనున్నారు.
» శ్రీసత్యసాయి జిల్లాలోని మడకశిరను కొత్త రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయనున్నారు.
» కదిరి డివిజన్లోని ఆమడగూరు మండలాన్ని పుట్టపర్తి రెవెన్యూ డివిజన్లో విలీనం చేయనున్నారు. పుట్టపర్తి డివిజన్లో ఉన్న గోరంట్ల మండలాన్ని పెనుకొండ డివిజన్లో కలపనున్నారు.
» నంద్యాల జిల్లా డోన్ రెవెన్యూ డివిజన్లోని బనగానపల్లె, అవుకు, కోవెలకుంట్ల.. నంద్యాల డివిజన్లోని సంజామల, కొలిమిగుండ్ల మండలాలతో కొత్తగా బనగానపల్లె రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది.


